అనురాధ దంపతుల హత్యలో ట్విస్ట్: మోసపోయిన మహిళ, ఆమె కుమారుడు
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తమకు తెలియకుండానే ఓ మహిళ, ఆమె కుమారుడు దుండగులకు సాయపడ్డారు. కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్లను హత్య చేసేందుకు జరిగిన కుట్రలో అధికార పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ భర్త కీలకపాత్ర వహించాడు.
తన పరిస్థితి బాగా లేకపోవడంతో ఓ ముస్లిం మహిళ ఆ కార్పోరేటర్ భర్తకు దగ్గరైంది. ఆ కార్పోరేటర్ భర్త ఆమెను, ఆమె మైనర్ కుమారున్ని తెలివిగా తమ కుట్రకు వాడుకున్నాడు. వారికి విషయం చెప్పకుండా హంతకులకు అవసరమైన ముస్లిం మహిళలు ధరించే బురఖాలను ఆమె ద్వారా కొనుగోలు చేయించాడు. నగరంలోని పేరుమోసిన ఓ వస్త్రదుకాణం నుంచి ఆ మహిళ మూడు బురఖాలను కొనుగోలు చేసి తెచ్చింది.
హత్యలకు పథకం పన్నిన రోజున ఉదయం ఆ తల్లీ కొడుకులను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాడు. ఓ అర్జీ చేతబట్టుకుని మేయర్ ఛాంబర్ ఎదుట విజిటర్స్తో కలసిపోయి నిరీక్షించాలని చెప్పాడు. పిల్లవాడికి మాత్రం మేయర్ కార్యాలయానికి రాగానే తనకు ఫోన్ చేయమని పురమాయించాడు.

మేయర్ రాగానే అక్క వచ్చిందంటూ బాలుడు ఫోన్ ద్వారా కార్పొరేటర్ భర్తకు సమాచారమిచ్చాడు. ప్రతి రెండు నిమిషాలకూ కార్పొరేటర్ భర్త ఆ పిల్లవాడికి ఫోన్ చేసి జరుగుతున్న పరిణామాలు తెలుసుకుంటూ వచ్చాడు. మేయర్ గదిలో ఆమె భర్త వున్నట్టు ఆ బాలుడి ద్వారానే నిర్ధారించుకున్న కార్పొరేటర్ భర్త రంగంలోకి దిగవచ్చునంటూ హంతకులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు.
హంతకులు బురఖాలో వెళ్ళేలా ముందే ప్లాన్ వేసుకున్నందున ఆ సమయంలో మేయర్ ఛాంబర్ వద్ద బురఖా ధరించిన ముస్లిం మహిళ ఉంటే ఆమెతో కలగలసి పోవచ్చునని, ఎవరికీ అనుమానం రాదని బాలుడి తల్లిని ముందే అక్కడ ఉంచారు. హంతకులు బురఖాలతో మేయర్ ఛాంబర్లోకి ప్రవేశించడం, గొడవ జరగడం, కాల్పుల శబ్దం, రక్తపు మడుగులో పడివున్న మేయర్ దంపతులను ఆసుపత్రికి తరలించడం వంటి ప్రతి అంశాన్నీ కార్పొరేటర్ భర్త దూరంగా వుండే బాలుడికి ఫోన్ చేయడం ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు.
హత్య జరిగిన వెంటనే అతను కూడా హంతకులతో కలసి పరారయ్యా డు. నమ్మి దగ్గరైన మహిళను, ఆమె కొడుకునూ కార్పొరేటర్ భర్త దారుణంగా వంచించారు. పోలీసు అధికారులు మానవత్వంతో స్పందించారు. కేసు దర్యాప్తులో భాగంగా వారిని విచారించిన పోలీసు అధికారులు హత్యలకు కుట్ర జరిగిన సంగతి గానీ, దాన్ని అమలు చేసిన సంగతిగా నీ వారికి తెలియదని గుర్తించారు.
దాన్ని నిర్ధారించుకున్న తర్వాత కేసులో వారిని నిందితులుగా కాక సాక్షులుగా వాడుకోవాలని నిర్ణయించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ జి.శ్రీనివాస్ ఆ విషయాన్ని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications