కాల్ మనీ సెక్స్ రాకెట్లో కొత్త కోణం: అమరావతిలో భూముల కొనుగోళ్లు
విజయవాడ: విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠా పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేసినట్లు బయటపడింది.
కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠా ఆర్థిక మూలాలపై టాస్క్ఫోర్స్ ఆరా తీస్తోంది. కొందరు రాజకీయ నాయకులతో పాటు ఎన్నారైల పెట్టుబడులు కూడా ఉన్నట్లు సమాచారం రావడంతో ఆ దిశగా విచారణ కొనసాగుతోంది. కొందరు ఎన్నారైలతో పాటు ఆర్థికంగా బలపడినవారు కాల్ మనీ సెక్స్ రాకెట్ ముఠా తరఫున పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు చెన్నుపాటి శ్రీనివాస రావు, వెనిగళ్ల శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు వారి సన్నిహితుల ద్వారా, బంధువుల ద్వారా నిందితులపై పోలీసులు ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్థితిలో నిందితులు లొంగుబాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.