పెళ్లికి ఆంధ్ర అబ్బాయి ట్విస్ట్: వాడుకుని మోసమని తమిళం అమ్మాయి రోదన
తిరువళ్లూరు: ప్రియుడు పారిపోవడం వల్ల పెళ్లి ఆగిపోయిందంటూ చెప్పిన సంఘటన మరో మలుపు తిరిగింది. ఆంధ్ర అబ్బాయి, తమిళం అమ్మాయి ప్రేమ వ్యవహారం, పెళ్లి ఘటన చాలా ఆసక్తికరంగా మారింది. ప్రేమించి, రిజిష్టర్ మ్యారేజీ చేసుకున్న యువకుడితో సంప్రదాయబద్దంగా చెంగాళమ్మ ఆలయంలో పెళ్లి చేస్తామని యువతుని, బంధువులను పిలిపించి తికబాదారాని ఆరోపిస్తూ ఓ యువతి తిరువళ్లూరు కలెక్టర్ వీరరాఘరావును కలిసి ఫిర్యాదు చేసింది.
తిరువళ్లూరు జిల్లా కొత్తగుమ్మిడిపూండిలోని కాళహస్తిగుడి వీధికి చెందిన సంపత్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని కూతురు సంగీత (20). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం రాసికండ్రిగకు చెందిన చంద్రశేఖర్ కుమారుడు వివేక్ (20).
వివేక్ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్నాడు. ఆ సమయంలో సంగీతతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. ఈ స్థితిలో సంగీత, వివేక్ గత ఆగస్టు 30వ తేదీన ఇళ్ల నుంచి వెల్లిపోయి కొడైకెనాల్లో తలదాచుకున్నారు. వీరిని సెప్టెంబర్ 17న గుర్తించి తల్లిదండ్రులు ఇంటికి తీసుకుని వచ్చారు.
ఆగస్టు 18వ తేదీన గుమ్మడిపూండిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి రిజిష్టర్ చేయించారు. ఆ తర్వాత అక్టోబర్ 26వ తేీదన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో సంప్రదాయబద్దంగా వివాహం జరిపించాలని నిర్ణయించారు.
దాంతో సోమవారం ఉదయం సంగీత, ఆమె తరపు బంధువులు వివాహం కోసం ఆలయం చేరుకున్నారు. అక్కడ పెళ్లి ఏర్పాట్లు కనిపించకపోవడంతో అనుమానం కలిగి సంగీత బంధువులు వివేక్ను, అతని బంధువులను నిలదీశారు. రెండు కుటుంబాల మధ్య వివాదం పెరిగి తమపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ సంగీత తన బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులతో వచ్చి కలెక్టర్ వీరరాఘరావుకు ఫిర్యాదు చేసింది.
తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా వాడుకున్నారని, తీరా వివాహం చేసుకోవాలని నిలదీస్తే తన బంధువులపై దాడి చేశారని ఆమె ఆరోపించింది. గ్రీవెన్స్ సెల్లో సంగీత బోరున విలపించింది. దాంతో యువతికి తక్షణం సాయం చేయాలని గుమ్మిడిపూండి డిఎస్పీ, ఇన్స్పెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.