ట్వీట్ల యుద్దం:మోడీ ట్వీట్ కు...మంత్రి నారాలోకేష్ రీ ట్వీట్
మిత్ర పక్షాల నుంచి శత్రు పక్షాలుగా మారిన టిడిపి-బిజెపి ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు వివిధ ప్రసార మాధ్యమాల వేదికగా తారాస్థాయిలో కొనసాగుతున్నాయి.
ప్రధాన మీడియా కేటగిరిలైన పత్రికలు, టీవీ ఛానెళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు, కార్టున్ల ద్వారా ఈ రెండు పార్టీలు ఒకదాన్నొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అదే క్రమంలో తాజాగా ఈ రెండు పార్టీల అతి ముఖ్యమైన ఇద్దరు నేతల మాటల దాడికి ట్విట్టర్ కూడా వేదికగా మారడం గమనార్హం. ఇంతకీ ఆ ఇద్దరు ముఖ్య నేతలు ఎవరంటే...ఒకరు ప్రధాని మోడీ కాగా మరొకరు ఎపి మంత్రి నారా లోకేష్. విమర్శలు అనే అంశం గురించి ప్రధాని మోడీ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ కు స్పందించి మంత్రి నారా లోకేష్ రీ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విమర్శపై...ప్రధాని మోడీ ట్వీట్...
ఇంతకీ ప్రధాని మోడీ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ఏమిటంటే...తనకు విమర్శతో సమస్య లేదని, అయితే సమస్యల్లా ఎవరైనా విమర్శ చేయాలంటే సరైన పరిశోధన, ఆధారాలు, వాస్తవాలు లేకుండా విమర్శలు చేయడమేనని...ఇప్పుడంతా అదే జరుగుతోందని...అన్నీ అసత్య ఆరోపణలే బాధకరమంటూ... ప్రధాని మోడీ ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశారు.
మోడీ ట్వీట్ కి...లోకేష్ రీ ట్వీట్
ప్రధాని మోడీ చేసిన ఈ ట్వీట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించి తాను కూడా రీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ భావం ఏంటంటే...కానీ దురదృష్టవశాత్తూ బిజెపి కూడా అచ్చం అదే చేస్తోందని, చట్టంలో పొందుపరిచిన విధంగా ఏపికి విభజన హామీలు నెరవేర్చాలని కోరినందుకు బిజెపి నేతలు వాస్తవాలను ఏమాత్రం పరిశీలించకుండానే తమపై బురద జల్లడం, విమర్శలు చేయడం చేస్తున్నారని బదులు ఇచ్చారు.
ముఖాముఖి యుద్దంతో...సంచలనం
మరోవైపు ప్రధాని మోడీ ట్వీట్ కు మంత్రి నారా లోకేష్ రీ ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని మోడి ఏదో సందర్భం విషయమై చేసిన ట్వీట్ ను సందర్భోచితంగా పట్టుకుని లోకేష్ ఎదరుదాడికి దిగడం టిడిపి శ్రేణుల్లో సమర స్ఫూర్తిని రగిలిస్తోంది. అంతేకాదు యుద్దానికి సిద్దం అన్నట్లుగా...ప్రధానితో నైనా ఢీ కొట్టేందుకు సిద్దం అన్న చందంగా లోకేష్ నేరుగా మోడీకే ఎక్కుపెడుతూ ట్వీట్ అస్త్రం సంధించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శ, ప్రతి విమర్శలపైనే ఈ ట్వీట్ ఉండటంతో లోకేష్ ప్రతిస్పందన సమయోచితంగా ఉందని టిడిపి నేతలు మెచ్చుకుంటున్నారు.
అయితే...ముందు ముందు
అయితే ప్రధాని మోడీ ట్వీట్ కు స్పందించి నేరుగా ఆయనకే తగిలేలా...పరిస్థితి ఆయనకే అర్థమయ్యేలా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఈ రెండు పార్టీల మధ్య యుద్దం మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీనే లోకేష్ నేరుగా టార్గెట్ చేయడంతో బిజెపి నేతలు ఇక లోకేష్ పై ప్రత్యేక దృష్టి పెట్టి విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఇక టిడిపి వైపు నుంచి చూస్తే లోకేష్ ట్వీట్ కు మోడీ ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, అసలు స్పందిస్తారా లేదా అనే అంశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీపై, బిజెపిపై దాడుల కొనసాగింపు ఖాయమైనప్పటికీ ఈ విషయంలో మోడీ స్పందించే తీరును బట్టి ఆయనపై ముందు ముందు దాడి కొనసాగించే విషయమై ఒక పంథా నిర్ణయించుకునే అవకాశం ఉంది.