జగన్కు 'అనంత' షాక్: సైకిలెక్కనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు?
అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, కడప జిల్లాల నుంచి వలసల పర్వం అనంతపురం జిల్లాకు కూడా పాకుతోంది.
ప్రస్తుతం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి, కదిరి నుంచి అత్తార్ చాంద్బాషా వైసీపీ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల రాష్ర్టంలో చోటుచేసుకొంటున్న పరిణామాలతో వీరిద్దరూ కూడా వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతారనే ప్రచారం జోరందుకుందంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషా- వీరిద్దరూ గతకొద్ది రోజులుగా వైసిపితో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. దీంతో వారు పార్టీ మారతారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్కు ప్రత్యర్థిగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి టీడీపీలోకి చేరుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, వైరి వర్గాలను ఒక చోట చేరుస్తూ చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తున్నారు.
గతంలో కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేసిన విశ్వేశ్వర రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ తరపున ఉరకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. జగన్కు విశ్వాసపాత్రుల్లో ఒకరిగా ఉన్న విశ్వేశ్వరెడ్డి అధికారపార్టీపై విమర్శల దాడి తగ్గించారు.
అయితే, తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధికారపక్షంపై దూకుడు తగ్గించారని ఆయన అనుచరులు చెబుతున్నారని వార్తలు వచ్చాయి. జగన్ పట్ల విధేయతతో ఉన్న ఆయన టిడిపిలోచేరే అవకాశం లేదని ఆయన అనుచరులు చెబపుతున్నారు.
కాగా, పయ్యావుల కేశవ్కు, విశ్వేశ్వరరెడ్డికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయని, వారిద్దరినీ జెసి కలుపుతారని అంటున్నారు.
మరో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చాంద్బాషా గతంలో టిడిపిలోనే ఉన్నారు. చాంద్ బాషాకి ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. టిడిపి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఆయనకు రాజకీయ గురువుగా చెబుతుంటారు. టిడిపి తరపున బాషాకు టిక్కెట్ ఇప్పించడానికి పార్థసారథి గతంలో తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు.
చివరి నిమిషంలో జగన్ నుంచి పిలుపు రావడంతో ఆ పార్టీ కండువా కప్పుకొని విజయం సాధించారు. వైసిపి నుంచి గెలిచినా టిడిపి నేతలు ఆయనను తమవాడిగానే చూస్తుంటారు. కదిరి అభివృద్ధి కోసం చాంద్ బాషా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా టిడిపి నేతల మైండ్ గేమ్లో భాగమని, తనకు రాజకీయ భిక్షపెట్టిన వైసిపిని విడే ప్రసక్తి లేదని చాంద్ చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో మరో బలమైన నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కుటుంబం కూడా వైసీపీని వీడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే గురునాథరెడ్డి ఆయన ద్వారానే అధికార పార్టీలోకి వెళ్తారని వినికిడి.