లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్: ఒకరు ఏపి, మరొకరు ఒడిశా
ట్రిపోలి: లిబియాలో మరో ఇద్దరు భారతీయులు అపహరణకు గురయ్యారు. ఇప్పటికే ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఉగ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగా శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది.
ఈ ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా, మరొకరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని వెల్లడించింది. కిడ్నాపైన ఇద్దరిలో ఒకరు ఏపీకి చెందిన కొసనం రామ్మూర్తి కాగా, మరొకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్ లుగా గుర్తించామని, వీరిని చెర నుంచి విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇది ఇలా ఉండగా, గతంలో నలుగురు భారతీయులను అపహరించిన ఉగ్రవాదులు.. కర్ణాటకకు చెందిన ఇద్దరిని వదిలిపెట్టారు. అయితే మరో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను ఉగ్రవాదులు తమ వద్దే బందీలుగా ఉంచుకున్నారు.
కాగా, ప్రతి రోజూ సిర్తే విశ్వవిద్యాలయం డీన్తో సంప్రదింపులు జరుపుతున్నాం.. ప్రొఫెసర్ల విడుదలలో జాప్యం జరుగుతోందని విదేశీ వ్యవహారాలశాఖ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు కూడా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్తో ఈ విషయంపై మాట్లాడారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇద్దరు ప్రొఫెసర్లను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రహస్య ప్రదేశంలో ఉంచారని, సోమవారం సాయంత్రం వరకూ వారు క్షేమంగానే ఉన్నారని సిర్టే యూనివర్సిటీ డీన్ వెల్లడించినట్లు విదేశాంగశాఖ అధికారులు తెలిపారు.
అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారినందున వారిని విడుదలచేస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం లేనందువల్లనే విడుదలలో జాప్యం జరుగుతోందని డీన్ వివరించినట్లు తెలిపారు.