జగన్కు ఆగని షాక్లు: టిడిపిలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
విజయనగరం: శాసనసభ్యుల ఫిరాయింపులను ఆపేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఒకరి తర్వాత మరొకరు టిడిపిలోకి క్యూ కడుతూనే ఉన్నారు. ఓ వైపు సుజయకృష్ణ రంగారావు టిడిపిలో చేరడం ఖాయమైన నేపథ్యంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జగన్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శత్రుచర్ల పుష్పశ్రీవాణి (కురుపాం), పీడిక రాజన్నదొర (సాలూరు) టిడిపిలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుజయ కృష్ణను బుజ్జగించడానికి జగన్ చేసిన చివరి ప్రయత్నం విఫలమైంది.
గురువారం విజయసాయిరెడ్డితోపాటు చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా ఇన్చార్జి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తదితర నాయకులంతా బొబ్బిలి కోటకు చేరుకున్నారు. ఇది ముందే తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆయన సోదరుడు బేబినాయనలు కోటలో తాము లేమని చెప్పారు.

ఫోన్లో మాట్లాడేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించినా సుజయ్కృష్ణ ఫోనెత్తలేదు. దాంతో నిరాశతో వెనుదిరిగారు.
సుజయకృష్ణ శుక్రవారం ఈ నెల 5వ తేదీ టీడీపీలో చేరాలని ముందుగా అనుకున్నారు. కానీ శ్రీరామనవమి కావడంతో ఆ రోజు చేరడం మంచిది కాదని పండితులు చెప్పారు. దీంతో శనివారం గానీ, లేదంటే 18న గానీ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని సమాచారం.
కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈమెతో పాటు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తమ వద్దకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికితోడు పార్టీ కార్యకర్తలు, నాయకులు అభీష్టం మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని రాజన్నదొరే స్వయంగా ప్రకటించారు.
ఈ విషయం తెలిసి విజయసాయిరెడ్డి, భాస్కరరెడ్డి, కృష్ణదాస్, కోలగట్ల గురువారం ఆయనను కలిశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతోనే వైయస్సార్ కాంగ్రెసులోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే కార్యకర్తలు, నాయకుల అభిప్రాయమే తనకు శిరోధార్యమని ఆయన వారితో స్పష్టంచేశారు. తర్వాత వీరు కురుపాం ఎమ్మెల్యేను కూడా కలిసేందుకు ఆమె స్వగ్రామం మేరంగి వెళ్లాలనుకున్నారు. ఆమె అక్కడ లేరని తెలిసి ఆగిపోయారు.












Click it and Unblock the Notifications