ఏపీలో కలకలం రేపుతున్న కరోనా: కడపలో కొత్తగా రెండు కేసులు, గల్ఫ్ వచ్చినవారికే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి కడపకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమె జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసంతో బాధపడుతోంది. దీంతో ఆమెను కడప రిమ్స్కు తరలించారు.
పరీక్షించిన వైద్యులు కరోనా అనుమానిత వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి కూడా రెండు రోజుల క్రితం గల్ఫ్ నుంచి కడపకు వచ్చారు. ఆయనకు కూడా దగ్గు, జలుబు, జ్వరం అధికంగా ఉండటంతో రిమ్స్ కు తరలించారు. వీరిద్దరికీ కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో రిమ్స్ లోనే కరోనా ప్రత్యేక వార్డులో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.
కాగా, ఇప్పటికే నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కర్నూలు, విజయవాడలోనూ అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోనూ రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఓ కరోనా పాజిటివ్ వ్యక్తికి నయం కావడంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు లేదని మంత్రి ఈటెల ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 75 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా నిర్ణారణ అయ్యింది. గూగుల్ సంస్థే ఈ మేరకు ప్రకటించింది. కాగా, కర్ణాటకలోనే దేశంలో తొలి కరోనా మరణం సంభవించిన విషయం తెలిసిందే.
తొలి మరణం
కరోనావైరస్(కొవిడ్-19) కారణంగా భారతదేశంలో తొలి మరణం నమోదైంది. బుధవారం కర్ణాటకలోని కలబుర్గిలో 76ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీ అనే వృద్ధుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతడు కరోనావైరస్ కారణంగానే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల కర్ణాటకలోని కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.
అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పుణెకు పంపగా.. వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అనే తేలింది. అంతకుముందు తెలంగాణలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అతడు చికిత్స పొందినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడి మృతిపై తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం అందించింది.












Click it and Unblock the Notifications