గొంతెమ్మ కోర్కెలు కావు, అవమానించారు:బాబు, మోడీకి ఫోన్
అమరావతి: ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు హోదా ఇవ్వడం కుదరదని చెప్పడం సరైంది కాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రివర్గంలో చేరినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
Recommended Video
బాబు బాటలోనే బిజెపి: కేబినెట్కు మాణిక్యాలరావు, కామినేని గుడ్బై
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన తర్వాత పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు.రాష్ట్ర మంత్రులతో చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.
ఎన్డీఏకు టిడిపి కటీఫ్, ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామా
బుధవారం రాత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై బాబు తీవ్ర అసంతృప్తితో కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు బుధవారం రాత్రి పూట చంద్రబాబునాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్డీఏలోని ఇద్దరు మంత్రులను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు
గొంతెమ్మ కోర్కెలు కావు
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులను ఇవ్వాలని పోరాటం చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.కానీ, తమ పోరాటాన్ని అవమానపర్చేవిధంగా కేంద్రం వ్యవహరించిందని చంద్రబాబునాయుడు చెప్పారు.తమవి గొంతెమ్మ కోర్కెలుగా బిజెపి నాయకత్వం వ్యవహరించడం సరిగా లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రం కోసమే కేబినెట్లో చేరాం
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర కేబినెట్లో చేరామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. లక్ష్యం కోసం కేబినెట్లో చేరామో ఆ లక్ష్యం నెరవేరలేదు. అందుకే రాజీనామా చేసి బయటకొస్తున్నాం. ప్రతి దానికీ రాజకీయాలు ముడిబెట్టొద్దని చంద్రబాబునాయుడు చెప్పారు. దేశ రక్షణకు ఇచ్చే నిధులను అడుగుతున్నారని అవమానపర్చేలా మాట్లాడారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం
తాము అనేక సంక్షోభాలను చూసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగేళ్ళ పాటు ఎదురుచూసినట్టు బాబు తెలిపారు.విభజన జరిగినప్పుడు ప్రజలు చాలా అందోళనకు గురయ్యారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నాకు అధికారం అప్పగించారు. నాలుగేళ్లలో ఎంతో కష్టపడిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.వెనుకబడిన జిల్లాల కోసం కేటాయించే రూ.350 కోట్లు ముందు రిలీజ్ చేసి.. ప్రధాని కార్యాలయం అనుమతి లేదని తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఈ పరిస్థితిని ఎలా చూడాలో అర్థం కావడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
పోలవరంపై 13వేల కోట్లు ఖర్చు చేశాం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ.13వేల కోట్లను ఖర్చు చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే కేంద్రం నుండి కేవలం 5వేల కోట్లు మాత్రమే అందాయన్నారు.2016-17 లెక్కలు పూర్తయ్యే నాటికి రూ.23వేల కోట్ల మేర రెవెన్యూ లోటు కనిపిస్తోంది. ఇంత లోటు ఉన్నా రూ.138 కోట్లు అంటూ ఓ సారి.. రూ.1600 కోట్లు అంటూ ఇంకోసారి లెక్కలు చెబుతున్నారని బాబు చెప్పారు.
మోడీకి ఫోన్ చేశాను
కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగాలని ప్రధానమంత్రి మోడీక్ సమాచారం ఇవ్వాలని ప్రయత్నించినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ, ప్రధానమంత్రి అందుబాటులోకి రాలేదని చెప్పారు. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రధానమంత్రి మోడీకి సమాచారాన్ని ఇవ్వాలని పిఎంఓ కార్యాలయానికి సమాచారాన్ని ఇచ్చామని చెప్పారు.