ట్రక్కును ఢీకొట్టిన బైక్: గచ్చిబౌలిలో ఇద్దరు టెక్కీల దుర్మరణం
హైదరాబాద్: ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత హైదరాబాదులోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న బైక్ ట్రక్కును ఢీకొట్టింది.
టెక్కీలు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులను హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల కొత్తగుడాలో నివాసం ఉంటున్న 27 ఏళ్ల అమోద్ సింగ్గా, లంగర్ హౌస్లో నివాసం ఉంటున్న రాజేష్ సింగ్ భార్య పూజా సింగ్ (26)లుగా గుర్తించారు.
అమోద్ సింగ్ లక్నోకు చెందినవాడు కాగా, పూజా సిగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రోహతక్ జిల్లా స్థానికురాలు. మృతులు, వారి సహోద్యోగులు అభిషేక్, నేహా చిలుకూరులోని బాలాజీ ఆలయానికి రెండు బైకులపై వెళ్లారు. శనివారం సాయంత్రం దైవదర్శనం చేసుకున్నారు.
ఆలయాన్ని దర్శించి తిరిగి వస్తూ ఫ్రెండ్ను గచ్చిబౌలిలోని ఇంట్లో దించడానికి బయలుదేరారు. మైక్రోసాఫ్ట్ ఒకటో గేట్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న ట్రక్కును బైక్ నడుపుతున్న అమోధ్ గుర్తించలేదు. దాంతో అతని బైక్ ట్రక్కును ఢీకొట్టింది. దాంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.
నిర్లక్ష్యంగా ట్రక్కును నడిపాడనే ఆరోపణపై డ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం గాలిస్తున్నారు. మరో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు టెక్కీలు సురక్షితంగా ఉన్నారు. వారు ట్రక్కుకు చాలా దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.