విశ్వాసాలు: వ్యక్తి మృతదేహానికి క్రైస్తవ, అతని ఫ్లెక్సీకి హిందూ సంప్రదాయ అంత్యక్రియలు
తూర్పుగోదావరి: కుటుంబసభ్యుల మత విశ్వాసాలు వేర్వేరుగా ఉండటంతో మరణించిన ఓ వ్యక్తికి రెండు రకాల అంత్యక్రియలు నిర్వహించారు. ఒకరు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించగా, మరొకరు ఫ్లెక్సీకి దహన సంస్కృరాలు నిర్వహించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది.
పిఠాపురం పట్టణానికి చెందిన కూరగాయల వ్యాపారి పద్దినీడి సత్యనారాయణ గురువారం మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ భార్య సీత, మూడవ కుమారుడు, కుమార్తె క్రైస్తవ మతం స్వీకరించారు. సత్యనారాయణ సహా మిగిలిన ఇద్దరు కుమారులు హిందూ మతాచారాలనే పాటిస్తున్నారు.
అయితే సత్యనారాయణ మృతదేహానికి అంత్యక్రియలు ఏ మతాచారం ప్రకారం నిర్వహించాలనే సందేహం తలెత్తింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం భార్య సీత కోరిక మేరకు క్రైస్తవ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి క్రైస్తవ శ్మశాన వాటికకు తరిలించారు.
అయితే మిగిలిన ఇద్దరు కుమారులు మాత్రం సత్యనారాయణ హిందూమత సంప్రదాయాలనే నమ్మినందున ఆ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తేనే తండ్రి ఆత్మ శాంతిస్తుందని భావించారు. దీంతో తండ్రి చిత్ర పటానికి(ఫ్లెక్సీ) శవయాత్ర నిర్వహించి, హిందూ స్మశాన వాటికకు తీసుకువెళ్లి కట్టెలపై ఉంచి, దహన సంస్కారాలు నిర్వహించారు.