ఏపీ రాజధానిలో ఆ గ్రామ కార్యాలయంలో గాడిదని కట్టేసి వినూత్న నిరసన .. అసలు మ్యాటర్ ఏంటంటే !!
మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎర్రబాలెం గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో గాడిదను కట్టేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పంచాయతీ కార్యాలయంలో గాడిదను ఎందుకు కట్టేశారు అన్న చర్చ అసలు విషయం అందరికీ తెలిసేలా చేసింది.
షాకింగ్ : చిత్తూరు జిల్లాలో 74మంది గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా .. వారి వేధింపులే కారణమట !!
రోడ్లపై గాడిదల సంచారం .. రోడ్డు ప్రమాదాలతో ప్రజల్లో భయం
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో గత కొంత కాలంగా రోడ్లపై గాడిదలు సంచరిస్తున్నాయి. దీంతో వాహనచోదకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ప్రధానంగా రాత్రి సమయాలలో వాహనచోదకులు, రోడ్ల పై పడుకున్న గాడిదలను గుర్తించలేక చీకటిలో వాటిని గుద్ది ప్రమాదాల బారిన పడుతున్నారు. వీధిలైట్లు సరిగ్గా వెళ్లకపోవడంతో రోడ్లపై పడుకున్న గాడిదలను గుర్తించలేకపోతున్నారు. గాడిదల కారణంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
పంచాయతీ కార్యాలయంలో అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు
ఇక ఏడెనిమిది నెలల క్రితం ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఓ గాడిద రోడ్డుపైకి రావడంతో కంట్రోల్ చేసుకోలేకపోయిన వాహనదారుడు దాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో సదరు వాహనదారులు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత పంచాయతీ అధికారులకు గ్రామస్తులు అనేకమార్లు ఫిర్యాదులు చేశారు. రోడ్లపై గాడిదలు సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.
పంచాయతీ ఆఫీస్ లో గాడిదను కట్టేసి వినూత్న నిరసన
అయినప్పటికీ అవేమీ పట్టనట్టు పంచాయతీ అధికారులు ప్రవర్తించడంతో విసిగి పోయిన ఓ గ్రామస్తులు గాడిదను తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయంలో కట్టేసాడు. సమాచార హక్కు చట్టం కార్యకర్త ఎన్ నాగరాజు ఈ వినూత్న నిరసనకు పాల్పడ్డారు.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారుల తీరుకు నిరసనగా గ్రామపంచాయతీ కార్యాలయంలో గాడిదను కట్టేశాను అని చెప్పిన సమాచార హక్కు చట్టం కార్యకర్త నాగరాజు, గ్రామంలో యథేచ్ఛగా గాడిదలు మాత్రమే కాదు, పందులు, ఆవులు స్వైర విహారం చేస్తున్నాయని, రోడ్లపై వాటి సంచారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికీ కూడా పట్టించుకోకుంటే పందులను, ఆవులను కూడా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించి నిరసన తెలియజేస్తామని నాగరాజు వెల్లడించారు. మరి ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రజల సమస్యలను గాలికొదిలేసి గాడిదలు కాసే పనిలో అధికారులని సెటైర్లు
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పంచాయతీ ఆఫీస్ లో గాడిదను కట్టేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను గాలికొదిలేసిన అధికారులు గాడిదలు కాస్తున్నారు అంటూ ఈ ఘటన తెలిసిన చాలామంది సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వదిలి పని చేయాలని సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, అలాగే జంతువుల ప్రాణాలకు హాని కలుగుతున్న క్రమంలో రోడ్లపై సంచరిస్తున్న మూగజీవాలను వాటి కోసం పశువుల దొడ్లను ఏర్పాటుచేసి అందులోకి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎక్కడ చూసినా ఇదే సమస్య .. మూగజీవాల సమస్య పరిష్కరించమన్న అధికారులు
ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనే కాదు, తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎక్కడచూసినా రోడ్లపైన తిరుగుతున్న ఆవులు, దూడలు వాహనచోదకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏమాత్రం భయం లేకుండా రోడ్లపైన ప్రశాంతంగా కూర్చుంటున్న, పడుకుంటున్న పశువులు, అకస్మాత్తుగా అడ్డం వస్తున్న జంతువులు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలని, అసలే ఇరుకుగా ఉన్న రోడ్లపై మూగజీవాల సంచారాన్ని అధికారులు ఆపాలని, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తులు వెల్లువగా మారుతున్నాయి.