విశాఖతో పాటు మరో 7 నగరాల్లో 'ఉబెర్' సేవలు
విశాఖపట్నం: అమెరికాకు చెందిన ఆన్లైన్, మొబైల్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్ధ ఉబెర్ తన సేవలను భారత్లో మరో 7 నగరాలకు విస్తరించింది. ఏపీకి చెందిన విశాఖపట్నంతో పాటు భువనేశ్వర్, కోయంబత్తూర్, మైసూర్, నాగ్పూర్, సూరత్లలో తన సేవలను అందించనుంది.
ఈ సందర్భంగా ఉబెర్ విస్తరణ అధిపతి (భారత్, ఉపఖండం) నీరజ్ సింఘాల్ మాట్లాడుతూ ఉబెర్కు భారత్ ఎంతో కీలకమని చెప్పారు. ఒకేసారి ఇన్ని నగరాల్లో సేవలను ప్రారంభించడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
దీంతో భారత్లో మొత్తం 18 నగరాల్లో సేవలు అందిస్తున్నట్లవుతుందని అన్నారు. అమెరికా తర్వాత ఉబెర్ క్యాబ్స్కు భారత్ రెండో అతి పెద్ద మార్కెట్ అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 300కు పైగా నగరాల్లో ఉబెర్ తన సేవలను అందిస్తోంది.

క్యాబ్ ఆధారిత సేవలో భారత్లో ఓలా ముందుండగా ఉబెర్ దానికి పోటీ పడేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఓలా క్యాబ్స్ భారత్లో 88 నగరాల్లో తన సేవలను అందిస్తోంది. వచ్చే ఏడాదిలోపు దాదాపు 200 నగరాల్లో తమ సేవనలు అందించాలనే ఆలోచనలో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉబెర్కు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, భారత్లో మాత్రం ఓలా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది.












Click it and Unblock the Notifications