చంద్రబాబు, పవన్ నుంచి ప్రాణహాని, కూతురు కిడ్నాప్ యత్నం: ఉదయ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేరంగుల ఉదయ్కిరణ్ ఆరోపించారు. తనకేదైనా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాను ఇటీవల చంద్రబాబు, పవన్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశానని, దీంతో తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారని అన్నారు.
తనకు వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సెంట్రల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశానని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లలో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నారు. పోలీసులు తప్పుడు నివేదిక ఇవ్వడమే ఇందుకు కారణమని చెప్పారు. చివరికి హైకోర్టును ఆశ్రయించానని, ఆగస్టు 22లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని కోర్టు ఆదేశించిందన్నారు.