ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు... రామ్ చరణ్ ట్వీట్ వైరల్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. స్టాలిన్ బాధ్యత రాహిత్యంగా మాట్లాడారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు పెట్టారు.
సోషల్ మీడియాలో ఉదయనిధిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి ఉదయనిధి హాజరై ' డెంగ్యూ, మలేరియా ఎలాగో సనాతన ధర్మం కూడా అంతే.. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు.. దాన్ని నిర్మూలించాలి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి, బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇటువంటి తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఓ పాత ట్వీట్ వైరల్ గా మారింది.

''సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత.. భారతీయ కల్చర్ మ్యాటర్స్'' అంటూ సనాతన ధర్మం గురించి 2020లో రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో తన తల్లి సురేఖ తులసిమొక్కకు పూజ చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఉదయం నిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో రామ్ చరణ్ పాత ట్వీట్ ని ప్రస్తుతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడికి, చిరంజీవి కుమారుడికి సనాతన ధర్మంపై అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడండి? అంటూ పోస్టులు పెడుతున్నారు.

రామ్ చరణ్ ను చూసి బుద్ధితెచ్చుకోవాలని సూచిస్తున్నారు. తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఇంత వివాదం చెలరేగుతున్నా ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని, బీజేపీవారే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమిళనాడులో డీఎంకేకు వ్యతిరేకంగా బీజేపీతోపాటు పలు హిందూ సంఘాలు విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications