ఏపీ, తెలంగాణలోని ప్రముఖ మెడికల్ కాలేజీలకు యూజీసీ నోటీసులు, వార్నింగ్
నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న పలు మెడికల్ కాలేజీలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీవ్రంగా స్పందించింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని వైద్య కళాశాలపై సీరియస్ అయ్యింది. అంతేగాక, దేశ వ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు కాలేజీలు ఉండటం గమనార్హం.
ఏపీ, బీహార్ రాష్ట్రాల నుంచి మూడు చొప్పున కాలేజీలు ఉండగా.. ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి నుంచి రెండేసి, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి.ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రా మెడికల్ కాలేజీ (విశాఖపట్నం), గుంటూరు మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉండటం గమనార్హం.

కాలేజీల్లో ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేసేందుకు యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్ -2009 నిర్దేశించిన తప్పనిసరి అంశాలను ఈ కాలేజీలు పాటించలేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ వెల్లడించారు. అంతేగాక, ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి యాంటీ ర్యాగింగ్ డిక్లరేషన్ను పొందడంలో విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
యూజీసీ నోటీసులు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా సరైన కారణాలను, లోపాల్ని సరిదిద్దేందుకు తీసుకునే చర్యల్ను వివరిస్తూ లిఖితపూర్వకంగా వివరణ పంపాలని ఆదేశించినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్ తెలిపారు. నిర్దేశిత గడువులోకా సంతృప్తికరమైన వివరణ సదరు కాలేజీల నుంచి రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications