భువనగిరి: తెలంగాణవాదమే ఉమా మాధవరెడ్డికి గండం
నల్లగొండ: తెలంగాణవాదమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమా మాధవరెడ్డికి నల్లగొండ జిల్లా భువనగిరి శాసనసభా స్థానంలో ఈసారి గండంగా మారే ప్రమాదం ఉంది. గత మూడు పర్యాయాలు భువనగిరి ఖిల్లాపై జెండా ఎగురవేస్తూ వస్తున్న ఆమెకు ఈసారి మాత్రం విజయం అంత సులభంగా కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమ ప్రభావం భువనగిరిలో చాలా ఎక్కువ. గత ఎన్నికల్లో తెరాసతో పొత్తు కారణంగా ఉమా మాధవరెడ్డి గట్టెక్కారు.
తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ గెలిపిస్తుందనే ధీమాతోనే కాంగ్రెస్ కొత్త అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లుతో ప్రయోగం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తన అభ్యర్థిగా ఫైళ్ల శేఖర్రెడ్డిని బరిలోకి దింపింది. ఉమా మాధవరెడ్డిని రెండోసారి ఢీకొంటున్న జిట్టా బాలకృష్ణారెడ్డి ఈసారీ స్వతంత్రుడిగానే పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొని ఉంది.
నిజానికి, టిడిపికి భువనగిరి కంచుకోట. అదే తనను ఒడ్డుకు చేరుస్తుందని ఉమా మాధవ రెడ్డి నమ్ముతున్నారు. దివంగత మాధవరెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అభిమాన ధనం కూడా గట్టిగానే పనిచేస్తుంది. తెలంగాణ ఇచ్చిన ఘనతను చాటుకుంటూ యువజన కాంగ్రెస్ నాయకుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు అడుగులు వేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరుల ఆశీస్సులు ఉండటం వెంకటేశ్వర్లుకు కలిసి వచ్చే విషయం.
తెలంగాణ వాదాన్నే పూర్తి స్థాయిలో నమ్ముకుని తెరాస అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన పార్టీగా ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవంతో పాటు యువజన, సామాజిక సేవా కార్యక్రమాలూ తనను ఈసారి తప్పక విజేతగా నిలుపుతాయని జిట్టా బాలకృష్ణారెడ్డి ధీమాతో ఉన్నారు. ఆయనకు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. స్వతంత్య్ర అభ్యర్థిగా నిలబడినా ఉమా మాధవరెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు.
అప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతితో ఓటర్లు తనకు అనుకూలంగా స్పందిస్తారని, యువత మద్దతు, తటస్థ ఓటర్ల ఆశీస్సులు, ఇతర పార్టీలలోని అసంతృప్తి వాదుల అండ తనకే ఉంటాయని ఆయన విశ్వసిస్తున్నారు. సిపిఎం, బిఎస్పీ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు.