అప్పట్లో వైఎస్ రాజీనామాకు డిమాండ్: ఇప్పుడెందుకిలా బాబుకు ఉండవల్లి
విజయవాడ: అమరావతి భూదందాపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన రాజమండ్రిలోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. అమరావతి భూదందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారో వివరణ ఇవ్వాలని కోరారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి భూదందాపై అబద్ధాలు చెప్పడం మానుకోవాలని మండిపడ్డారు. అమరావతి భూముల కొనుగోలు విషయంలో రెవెన్యూ వెబ్సైట్ను ఎందుకు బ్లాక్ చేశారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రింగ్ రోడ్డు భూముల వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజీనామాకు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ఇప్పుడు అదే చంద్రబాబు విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరెవరు ఎన్నెన్ని ఎకరాల భూములను కోనుగోలు చేశారో ఫ్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.32 వేల కోట్లకు ఎలా పెంచారో వివరించాలని ఆయన అడిగారు.
పట్టిసీమ నుంచి కృష్ణాజిల్లాకు నీరిస్తే గోదావరి డెల్టా రైతుల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం సరికాదని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications