పవన్ లాంటి శ్రీకృష్ణుడు: జేపీతో భేటీపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు, జేపీ ఇలా, సీపీఐ నేతా కలిశారు!
హైదరాబాద్: బేగంపేటలోని లోక్సత్తా కార్యాలయంలో జయప్రకాశ్ నారాయణతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సోమవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, నిజనిర్ధరణ కమిటీ విధివిధానాలపై చర్చించారు.
Recommended Video
నిన్న పవన్ కల్యాణ్తో, నేడు జెపితో ఉండవల్లి: చిత్తశుద్ధే తప్ప...
విభజన హామీలు, ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 8న చేపట్టిన రాష్ట్ర బంద్లో చాలామంది పాల్గొని విజయవంతం చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రావాల్సిన వాటిపై పోరాటం చేస్తామన్నారు. ఈనెల 18న ఎంపీలు, విద్యార్థులు, ప్రజాసంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏమీ జరగలేదు.. చిత్తశుద్ధితోనే
భేటీ అనంతరం జేపీ మాట్లాడుతూ.. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, నిజనిర్ధారణ కమిటీ విధివిధానాలపై చర్చించామని తెలిపారు. మన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, మేధావులు, అందరి ఆలోచనలు తెలుసుకోవాలని అన్నారు.
ఏపీలో ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని చెప్పారు. నాలుగేళ్లయినా రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదని అన్నారు. అయితే, తాము ఏపీకి న్యాయం జరిగే వరకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని జేపీ చెప్పారు.
ముందుకు ఎలా?
అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వద్ద అధికారికంగా లేకపోయినా.. రాష్ట్ర సమాచారం మొత్తం ఉందని ఉండవల్లి చెప్పారు. జేపీ వద్ద ఉన్న సమాచారంతో ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నామని అన్నారు.
కేటాయింపులపై.. లక్కీగా సీపీఐ నేత
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దేనికి ఎంత కేటాయించింది, ఏ మేరకు హామీలు అమలు చేసింది.. దీనికి నిపుణుల నుంచి మరికొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని ఉండవల్లి తెలిపారు. లక్కీగా వేరే పనిమీద సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఇక్కడకు వచ్చారని, ఆయన కూడా ఈ భేటీలో పాల్గొన్నారని ఉండవల్లి తెలిపారు.
పవన్ లాంటి శ్రీకృష్ణుడు ఉండనే ఉంటాడు
రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తనది ధృతరాష్ట్ర కౌగిలి అని బిరుదు ఇచ్చిన మంత్రికి ఆయన మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ధృతరాష్ట్ర కౌగిలి నుంచి కూడా తప్పించుకోవచ్చని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంటి శ్రీకృష్ణుడు కూడా ఉంటారని ఉండవల్లి తెలిపారు.
అదే ప్రధానాంశం
అన్ని అంశాలను చర్చించి.. 3గంటల్లో సమస్యలను తేల్చేయొచ్చని ఉండవల్లి అన్నారు. ఎవరెవర్నీ ఇన్వాల్స్ చేయొచ్చన్న దానిపై చర్చించామని తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఏం కావాలన్నదానిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా, ఇటీవల జేపీ, ఉండవల్లితో కలిసి ముందుకు వెళ్ధామని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.