నిన్న పవన్ కల్యాణ్తో, నేడు జెపితో ఉండవల్లి: చిత్తశుద్ధే తప్ప...
Recommended Video
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో భేటీ అయిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమమవారం లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ చొరవతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ జెపితో సమావేశమైనట్లు తెలుస్తోంది. విభజన హామీల అమలు కోసం పోరాటం చేసేందుకు కార్యాచరణను రూపొందించే క్రమంలో ఈ భేటీ జరిగింది.
వారిద్దరి భేటీపై ఆసక్తి
విభజన హామీల సాధనకు జెఎసిని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ తర్వా సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జిఎఫ్సి)ని తెర మీదికి తెచ్చారు. దానిపై ఇప్పటికే జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్లతో పవన్ కల్యాణ్ చర్చలు జరపారు. పవన్ కల్యాణ్ సూచన మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం జెపితో భేటీ అయ్యారు.
అందరితో కలిసి పనిచేస్తాం
ఎపీ హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామని జెపి ఉండవల్లితో భేటీ అనంతరం చెప్పారు. జెఎఫ్సీతో పాటు జెఎసి ఏర్పాటుకు కూడా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పాల్గొనడం విశేషం. ఈ నెల 18వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తన్నట్లు ఆయన తెలిపారు.
అలా అమలు కావాల్సిందే...
ప్రజలకు పనికి వచ్చే రీతిలో అమలు కావాలని మనం కోరుతున్నామని జెపి మీడియాతో అన్నారు. దేశంలో గానీ రాష్ట్రంలో గానీ తాత్కాలికమైన ఆర్భాటాలు, ప్రకటనలు, హడావిడులపై శ్రద్ధ ఎక్కువగా ఉందని, వచ్చే ఫలితంపై శ్రద్ధ లేదని ఆయన అన్నారు.
మనం చేసే పనుల వల్ల
మనం చేసే పని వల్ల ప్రజలకు ఏ మేరకు ఫలితం వస్తుంది, యువత ఉపాధి కోసం ఏ మేరకు అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ మేరకు నిధులు అందుతాయనే విషయాలపై హడావిడి లేకుండా ఆలోచన చేస్తామని జెపి చెప్పారు. ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని, చిక్కుముడులు ఎక్కువయ్యాయని జెపి అన్నారు. తమకు చిత్తశుద్ది తప్ప బలం లేదని జయప్రకాశ్ నారాయణ అన్నారు.