బాబు వంటి మేథావికి, జైలుకెళ్తారని చెప్పారు: ఉండవల్లి సంచలనం, ఇవీ నిజాలు!
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై విచారణ జరిపితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలు చాలామంది జైలుకు వెళ్తారని బీజేపీ నేతనే చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
అడ్డగోలుగా వ్యవహరిస్తే జైలుకు: పోలవరంపై బీజేపీ వార్నింగ్, లేఖలో ఏముందంటే
పోలవరం కడితే 800 టీఎంసీలు వాడుకున్నా అడిగేవారు ఉండరని, ఆఖరి పాయింట్ కావడమే దీనికి కారణమని చెప్పారు. శ్రీరాంసాగర్ తర్వాత గ్రావిటీ ద్వారా నీరు తీసుకునే వీలు పోలవరం దగ్గరే ఉందని చెప్పారు. దివంగత వైయస్ 2005లో పోలవరం టెండర్లు పిలిచి ఒక్కో అనుమతి సాధించారన్నారు.
టీడీపీపై చేస్తున్న ఆరోపణలను కేంద్రం నమ్ముతోంది
ముంపు ప్రాంతాలకు ఇచ్చే పునరావాసం ఖర్చుకు ఆరోజే ముందు చూపుతో వైయస్ లెక్కకట్టి ప్రాజెక్టు ఖర్చులో చూపించారని ఉండవల్లి తెలిపారు. పక్క రాష్ట్రాల అభ్యంతరాలకు కూడా వైయస్ హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రాజెక్టు విషయమై ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్రం నమ్ముతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాబు వంటి మేథావికి ఎవరు సలహాలిస్తున్నారో
చంద్రబాబు వంటి మేధావులకు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి ఎద్దేవా చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని నిలదీశారు. విభజన చట్టంలో పెట్టిన పోలవరంను తాము కడతామని ఎందుకు పట్టుబట్టారో చెప్పాలన్నారు.
కేంద్రం అడిగింది ఇదీ.. వాస్తవాలు చెప్పాలి
2014 నాటి రేట్లకే కేంద్రం నిధులు ఇస్తుందని ఆనాడే నీతి అయోగ్ చెప్పిందని, దానికి చంద్రబాబు ఎందుకు అంగీకరించారని ఉండవల్లి నిలదీసారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖల్లో అమర్జిత్ సింగ్ ఏకంగా టెండర్లు నిలిపేయాలని సూచించారని, ఇ-ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన రాష్ట్ర వెబ్ సైట్లో ఆలస్యంగా ఎందుకు వివరాలు పెట్టారని ఆ లేఖలో అబ్యంతరాలు తెలిపారని గుర్తు చేశారు. పేపర్ నోటిఫికేషన్లో 1300 కోట్లు అని, వెబ్ సైట్లో సుమారు 1400 కోట్లు పెట్టారని కేవలం కాంట్రాక్టుల కోసమే అని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ఇప్పుడు కేంద్రం అడుగుతోందని, అందులోని వాస్తవాలు చెప్పాలన్నారు.
నామా కంపెనీని పిలిచి తప్పించారు
పై విషయాలు అన్నీ సీఎం చంద్రబాబుకు తెలియవా అని ఉండవల్లి నిలదీశారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పనులు చేయడం లేదని తెలిస్తే సదరు కంపెనీతో మాట్లాడి తప్పించాలన్నారు. నాడు పోలవరం పనులు ముందుకు సాగడం లేదని టీడీపీ నేత నామా నాగేశ్వర రావు కంపెనీని పిలిచి, పనుల నుంచి తప్పించారని గుర్తు చేశారు.
బీజేపీ నేతనే జైలుకు వెళ్తారన్నారు
చంద్రబాబు ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు గురించి వాస్తవాలు వెల్లడించాలని ఉండవల్లి అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధే లెక్కలు బయటపడితే జైలుకు వెళ్తారని హెచ్చరించినా చంద్రబాబు కళ్లు తెరవడం లేదన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల పాటు రాష్ట్రం చేసిన అప్పులు, అవి ఎక్కడకు వెళ్లాయో లెక్కలు చెప్పాలన్నారు.
ఎందుకు తీసుకున్నావ్
పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చయినా కేంద్రం భరించాలని యూపీఏ చివరి కేబినెట్ తీర్మానించిందని, కానీ నీతి అయోగ్ ద్వారా రాష్ట్రమే చేపడుతుందని చంద్రబాబు అంగీకారం తెలిపారని ఉండవల్లి అన్నారు. 2014లో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి నీతి ఆయోగ్ నివేదిక ఇస్తూ... పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం అడుగుతోందని, సొంత రాష్ట్రం పనులు చేస్తామంటే ఆ రాష్ట్రానికే ఇవ్వచ్చు అని రికమెండేషన్ చేసిందన్నారు. అంతే కాకుండా ఆరోజే 2014 లో ఉన్న రేట్ల ప్రకారమే నిధులు ఇస్తామని స్పష్టంగా చెప్పిందన్నారు. అలాంటప్పుడు మేధావి అయిన చంద్రబాబు ఎలా అంగీకరించారన్నారు.