పరిశ్రమలు ఎక్కడ బాబూ! ప్రజా రాజధానా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా?: ఉండవల్లి ఫైర్
రాజమహేంద్రవరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమరావతి బాండ్లున్నాయని అన్నారు. అమరావతి బాండ్లపై అధిక వడ్డీ ఇవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

రాజధాని నిర్మిస్తున్నారా? వ్యాపారమా?
హడ్కో తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నా ఎందుకు తీసుకోలేదేదో చెప్పాలని అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అని ఉండవల్లి ప్రశ్నించారు. సీఆర్డీఏను కంపెనీగా మార్చేసి అప్పులు తెచ్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

నా ప్రశ్నలకు సమాధానం చెబితే క్షమాపణ చెబుతా..
గవర్నర్ పాలనలో కూడా ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుందని ఉండవల్లి అన్నారు. అమరావతి బాండ్లు, పోలవరం, పట్టిసీమతో సహా రాష్ట్రంలో జరిగిన పంపింగ్ స్కీమ్స్, బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లు, సీఎం చెప్పిన 18లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు అనే ఆరు అంశాలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తనతో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వీటిపై తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే అక్కడే క్షమాపణలు చెప్పి మళ్లీ ఎన్నికల వరకు మాట్లాడనని అన్నారు.

పరిశ్రమలు ఎక్కడ బాబూ..
జనం కోసం రాజధాని కడుతున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. చదరపు గజానికి రూ. 1500లతో నిర్మిస్తున్న ఇళ్లను ప్రభుత్వం మూడువేలకు కట్టబెడుతోందని ఉండవల్లి అన్నారు. ఇక సీఎం చెప్పిన 18లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఎక్కడ ఉన్నయో చూపించాలని డిమాండ్ చేశారు.

సుజనా పరిశ్రమ రాలేదంటారు.. బాబు మాత్రం..
హెరిటేజ్ 30ఏళ్ల చరిత్ర చూస్తే ఎన్ని డెయిరీలు మూతపడ్డాయో తెలుస్తుందని ఉండవల్లి మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం ఏమో పరిశ్రమలు వచ్చాయంటారని, రాజ్యసభలో మాత్రం సుజనా చౌదరి ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటారాని తెలిపారు.












Click it and Unblock the Notifications