జగన్ మరో క్విడ్ ప్రోకో- ఓట్ల కోసమే నోట్ల పంపకం- నెవర్ బిఫోర్ గ్యాంబ్లింగ్-ఉండవల్లి షాకింగ్
ఏపీ రాజకీయాల్లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారని పేరున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపేలా ఉన్నాయి. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, కరెంటు సంక్షోభం వంటి పలు అంశాలపై ఉండవల్లి వ్యక్తం చేసిన అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
జగన్ మరో క్విడ్ ప్రోకో
ఏపీలో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ మరో క్విడో ప్రోకో కు తెరలేపారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ ఆరోపించారు. ప్రజలకు డబ్బులిచ్చాను, వారు తనకు ఓట్లు వేయాలనేదే జగన్ విధానమని ఉండవల్లి స్పష్టంచేశారు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఇదేనన్నారు. ఓట్లు వేయని వారికి మాత్రం పథకాలు ఇవ్వరని ఆయన విమర్శించారు.
ఇందులో ఆయన సక్సెస్ అవుతారా లేదా అన్న దానిపైనా ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.
నెవర్ బిఫోర్ గ్యాంబ్లింగ్
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో జగన్ సక్సెస్ అవుతారా లేదా అన్నది ఎవ్వరూ చెప్పలేరని ఉండవల్లి విశ్లేషించారు. ఎందుకంటే గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ఇప్పటివరకూ ఇలాంటి గ్యాంబ్లింగ్ ఎవరూ చేయలేదని ఉండవల్లి తెలిపారు. ఇలా ఎంతకాలం డబ్పులు పంచగలరని ఆయన ప్రశ్నించారు. ఎక్కడి నుంచి తీసుకురాగలరని కూడా నిలదీశారు. కేంద్రం నిధుల మళ్లింపుపై విచారణ జరుగుతోందని, విచారణలో ఎలాంటి ఫలితం వచ్చినా జగన్ ఏమీ అనుకోరని కూడా ఉండవల్లి తెలిపారు.
పోలవరం కేంద్రానికి ఎందుకివ్వరు ?
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని గతంలో చంద్రబాబును అడిగిన జగన్ ఇప్పుడు తాను ఎందుకు ఉంచుకున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టును కేంద్రమే కట్టి ఇవ్వాలని, గతంలో చంద్రబాబును ప్రశ్నించిన జగన్.. తాను అధికారంలోకి రాగానే కేంద్రానికి ఎందుకు అప్పగించలేదని ఉండవల్లి నిలదీశారు. కానీ అలా జరగలేదన్నారు. దీంతో జగన్ పైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
అందుకే కేంద్రం మొండిచేయి ?
బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేయడం వెనుక కారణాల్ని కూడా ఉండవల్లి కుండబద్దలు కొట్టారు. ఆంధ్రాలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కాబట్టి ఇక్కడ ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. మన ఎంపీలు దీనిపై గట్టిగా అడగలేరని ఉండవల్లి తెలిపారు. ఇప్పటివరకూ పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ఎప్పుడైనా ఎంపీలు ప్రశ్నించారా అని ఉండవల్లి అడిగారు. ఏపీ పునర్విభజన చట్టం ఎందుకు అమలు చేయడం లేదని కూడా పార్లమెంటులో నిలదీయలేకపోతున్నారి ఉండవల్లి విమర్శించారు.
ఏపీలో కచ్చితంగా పవన్ ప్రభావం
ఏపీ రాజకీయాల్లో మారుతున్న పరిస్ధితులపై మాట్లాడిన ఉండవల్లి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. అలాగే ఏపీలో వైసీపీ సర్కార్ హయాంలో హిందువులకు అభద్రతాభావం పెరుగుతోందన్నారు. మరోవైపు ఏపీలో ఆర్ధిక సంక్షోభం ముదురుతోందని, అలాగే విద్యుత్ సంక్షోభం కూడా పెరుగుతోందన్నారు. ఏపీలో విద్యుత్ రంగం నిర్వహణలో జగన్ విఫలమయ్యారని, గతంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని ఉండవల్లి గుర్తు చేశారు.