ఒక పార్టీతో పొత్తు ఆశతోనే, పార్టీ కంటే ప్రజలే: ఉండవల్లి

Undavalli Arun Kumar
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ ఒక పార్టీతో పొత్తు ఆశతో ముందుకెళ్తుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వానికే పెద్ద మచ్చ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే చాలా మచ్చలు పడ్డాయని, కానీ, సోనియా అధ్యక్షురాలైన తర్వాత ఎలాంటి మచ్చలూ పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారని, తెలంగాణ విషయంలో మాత్రం న్యాయ పరీక్షకు, ధర్మ పరీక్షకు నిలబడని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

తెలంగాణ నిర్ణయాన్ని ధర్మంగా చేశారని ఎవరూ భావించరన్నారు. తీవ్రమైన ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ విజయవంతంగా బయటపడుతుందని తాను భావిస్తున్నానని, ఒకవేళ బయటపడకపోతే కాంగ్రెస్‌పై ఈ మచ్చ అలా ఉండిపోతుందన్నారు. పార్టీని, పదవులను వదులుకుంటే ప్రజల్లోకి వెళ్లి మరింత స్వేచ్ఛగా మాట్లాడొచ్చనే రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తున్నామని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వారితో ఉండాలా? మనసు చంపుకొని పార్టీతో ఉండాలా? అని ప్రశ్నించుకున్నప్పుడు ప్రజలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు.

కానీ, విశ్వాసం కలిగిన కార్యకర్తగా పార్టీలో ఉండాలని కొందరు అనుకుంటే అది వారిష్టమన్నారు. ప్రస్తుతానికి తన వరకు తాను మాజీ ఎంపీనే అన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేంత వరకూ కేబినెట్‌కు తెలంగాణ నోట్ వెళ్లదని తమకు చెప్పారని, అదే విషయాన్ని ప్రజలకు కూడా చెప్పాలన్నారని, అలా తాము చెప్పిన మర్నాడే నోట్ కేబినెట్‌కు వెళ్లిందని, అందుకే పార్టీకి కూడా రాజీనామా చేశామన్నారు.

తీసుకున్న నిర్ణయం నుంచి సిడబ్ల్యూసి వెనక్కు పోదని, కేబినెట్ నిర్ణయం కూడా జరిగిపోయిందని, అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదన్నారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసేది కేంద్ర ప్రభుత్వం కాదని, పార్లమెంటు అన్నారు. మిగతా రాష్ట్రాలకూ ఆంధ్రప్రదేశ్‌కు చాలా తేడా ఉందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ సవరణలు కూడా జరగాల్సి ఉందన్నారు. ఇందుకు ఇతర పార్టీల బలం కూడా అవసరమని, తెలంగాణ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన బిజెపి కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడిందన్నారు.

ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వెళ్తే వ్యతిరేకిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర విభజనా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా జరగలేదన్నారు. కాబట్టి, ముసాయిదా బిల్లును అసెంబ్లీ వ్యతిరేకిస్తే దానిని రాష్ట్రపతి పార్లమెంటుకు పంపించే అవకాశాలు లేవన్నారు. రాజధాని ఉన్న ప్రాంతమే విడిపోతాననటం, సీమాంద్రుల్ని బయటకు పంపించేసి వారికొక రాష్ట్రం ఏర్పాటు చేయాలనటం, రాజధాని తమదేననటం.. పదేళ్లలో బయటకు వెళ్లిపోవాలని ఏదో కోర్టు ఆదేశంలా ఆదేశించటం కొత్తగా చూస్తున్నామన్నారు.

2014లోపు తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని తాను నమ్మటం లేదని, కాబట్టి తాను పార్లమెంటు లోపల ఉన్నా, లేకున్నా పెద్ద విలువ లేదని చెప్పారు. ప్రస్తుత పద్ధతుల్లో విభజన జరగటం అసాధ్యమన్నారు. సీమాంధ్ర ప్రజల్ని నొప్పించకుండా ఒప్పించి మెప్పించి ముందుకెళితేనే రాష్ట్ర విభజన జరుగుతుందని, అంతే తప్ప ఒకరు విజేతలు, మరొకరు పరాజితులు అన్న రీతిలో మాత్రం జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీల్లో లేకున్నా తాను రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+