అదే జరిగితే చంద్రబాబే సీఎం, ఆ అద్భుతమేంటో తెలియదు: ఉండవల్లి, పవన్, జగన్లపై ఇలా
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. పాదయాత్రతో జగన్కు మైలేజీ వచ్చే అవకాశముందని చెప్పారు. వైయస్, చంద్రబాబులు చేసిన పాదయాత్ర కంటే జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల్లో ఎక్కువ స్పందన వచ్చిందని చెప్పారు.
2014లో నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం చంద్రబాబుకు బాగా కలిసి వచ్చాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరిస్తారని తాము అనుకోలేదని, ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి అభినందించారని గుర్తు చేశారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా అడుగుతున్నారన్నారు.

విలన్గా మోడీని చూపించారు, జగన్ విషయంలో బాబుకు ఒకే ఆయుధం
ఏపీకి చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని, కానీ హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని విలన్గా చూపించడంలో విజయవంతమయ్యారని ఉండవల్లి చెప్పారు. జగన్ పైన విమర్శలు చేసేందుకు చంద్రబాబు వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం అవినీతి కేసు అన్నారు. అంతకుమించిన ఆయుధం మాత్రం లేదన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారని, అవినీతి కేసులు ఉన్నాయని చెప్పడం మినహాయించి ఏమీ లేదన్నారు.

ఇలాంటి కేసులు దేశంలో నిలబడ్డ దాఖలాలు లేవు
జగన్ పైన ఉన్న ఆస్తుల కేసు మాత్రం ఆయనకు మైనస్ అని ఉండవల్లి చెప్పారు. అదే సమయంలో జగన్ పైన కేసుల్లో సత్తా లేదని, ఈ ఆరోపణలు పేలవమైనవని చెప్పారు. మన దేశంలో క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసులు నిలబడ్డ దాఖలాలు లేవని చెప్పారు. జగన్ ఫలానా వ్యక్తితో, ఐఏఎస్ అధికారితో మాట్లాడారన్న విషయాలను ఛార్జీషీటులో ఎక్కడా పొందుపర్చలేదని చెప్పారు. తన అభిప్రాయం వరకు ఈ కేసులు నిలబడవని చెప్పారు.

అద్భుతం జరిగితే చంద్రబాబు సీఎం, అదేమిటో తెలియదు
వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరిగితేనే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఉండవల్లి జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చంద్రబాబుకు ఏమాత్రం అనుకూలంగా లేవని అభిప్రాయపడ్డారు. అద్భుతం జరిగితే చంద్రబాబు సీఎం అవుతారని, కానీ ఆ అద్భుతం ఏమిటన్నది తనకు తెలియదని చెప్పారు. రాబోయే మూడు నెలల్లో ఏదైనా జరగవచ్చునని చెప్పారు. అభ్యర్థుల కేటాయింపు మొదలు, టిక్కెట్లు లభించని వారి ప్రభావం తదితర అంశాలు ప్రభావం చూపుతాయన్నారు.

పవన్ కళ్యాణ్ పైన 'నో కామెంట్'
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కామెంట్ చేసేందుకు ఉండవల్లి నిరాకరించారు. గతంలో పవన్ నిర్వహించిన సమావేశానికి అందర్నీ ఐఏఎస్ అధికారులను పిలిచారని, రాజకీయ నాయకుల్లో తనను మాత్రమే గెలిచారని, అది ఆయన తనకు ఇచ్చిన గౌరవమని చెప్పారు. తనకు పరిచయం కానీ లేదా ఆయనకు తనకు కామన్ ఫ్రెండ్స్ కానీ పెద్దగా లేరని చెప్పారు. కానీ తనకు గౌరవం ఇచ్చి ఆహ్వానించారన్నారు. తనకు అంతగా గౌరవం ఇచ్చిన వ్యక్తిపై కామెంట్ చేయలేనన్నారు. అది తన వీక్నెస్ లేదా పక్షపాతం అనుకున్నా అభ్యంతరం లేదన్నారు. పవన్ అధికారంలోకి వస్తే మాత్రం కామెంట్ చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications