పోలవరంపై ఇప్పటికైనా నిజాలు చెప్పండి.. లేదంటే పెద్ద కుట్రే?: ఉండవల్లి
రాజమండ్రి: పోలవరం విషయంలో అసలేం జరుగుతుందో సామాన్యులకు అంతుపట్టని పరిస్థితి. 2019కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు నిందను కేంద్రంపై నెడుతుండటం చూస్తూనే ఉన్నాం.
అసలు ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారు?.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి? వంటి ప్రశ్నలకు ఇప్పటికీ రాష్ట్రం వద్ద సమాధానం లేదు. శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి లాంటి నేతలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పోలవరం నివేదికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఇప్పటికే అనుమానాలున్నాయి. రాష్ట్ర ప్రజలకు అనుమానాలు నివృత్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి పోలవరంపై స్పందించారు.

పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికైనా చంద్రబాబు నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలవరం ప్రాజెక్టులో అతి పెద్ద కుట్ర దాగుందని ప్రజలు భావిస్తారని తెలిపారు. ప్రాజెక్టు పనులు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిందని, కాదంటే.. తన మాట తప్పని నిరూపించాలని సవాల్ విసిరారు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ సర్కారు ఇచ్చిన నివేదికపై చర్చకు టీడీపీ సిద్ధమా? అని కూడా ఉండవల్లి సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయాన్ని విభజన చట్టం సైతం స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని మిగతా పార్టీలకు, పోలవరానికి సంబంధం లేదని.. అందుకే పోలవరం అథారిటీని కూడా ఏర్పాటు చేశారని అన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యత అథారిటీదేనని గుర్తుచేశారు. అథారిటీకి తెలియకుండా టెండర్స్ ఎలా పిలుస్తారని చంద్రబాబును ఉండవల్లి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications