ఏ పార్టీలో లేను, నారాయణతో శత్రుత్వం లేదు: ఉండవల్లి, జగన్ వైపేనా?
హైదరాబాద్: తాను ఏ పార్టీలో లేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం నాడు చెప్పారు. అలాగే, మంత్రి నారాయణ పైన తాను చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. తనకు మంత్రి నారాయణతో ఎలాంటి శతృత్వం లేదన్నారు.
'నారాయణకి అన్ని ఆస్తులా, ఓటుకు నోటు కోసం రేవంత్లా వేషమేయించారా'
ఆయన వ్యక్తిగత అంశాల పైన తనకు ఎవరూ సందేశాలు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు కృషి చేసేవారు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టిసీమ ప్రాజెక్టు పైన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల తరలింపు సాధ్యం కాద్నారు. దీనిపై చర్చకు వస్తే నిరూపిస్తానని చెప్పారు.
పట్టిసీమ పేరిట పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం వద్ద పోలవరం ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా దేశంలోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన ఘనత తమదేనని టిడిపి ప్రభుత్వం చెప్పుకుంటోందని, కానీ ఆ మాటలు అవాస్తవమన్నారు.
కాగా, మంత్రి నారాయణ తనకు రూ.474 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారని, అంత ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని ఉండవల్లి నాలుగు రోజుల క్రితం ప్రశ్నించారు. నారాయణ సీఎం చంద్రబాబుకు కుడి, ఎడమ చేతులు అంటుంటారన్నారు. దీనిపై నారాయణ మాట్లాడుతూ.. తాను ట్యూషన్ చెప్పి, కష్టడపడి పైకొచ్చానని కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల ఉండవల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు అనుకూలంగా మాట్లాడినట్లుగా కనిపించింది. దీంతో ఆయన వైసిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు తాను ఏ పార్టీలో లేనని చెప్పారు. కానీ భవిష్యత్తులో వైసిపిలో చేరనున్నారా అనే చర్చ సాగుతోంది.