జగన్ వేవ్ ఉంది కానీ, బాబు ఏదైనా చేస్తారు, పవన్ గురించి ఇప్పుడే చెప్పలేం: ఉండవల్లి
Recommended Video

అమరావతి: ఇప్పుడు ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ వైపు వేవ్ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం అన్నారు. అయితే, ఈ వేవ్ను మార్చగలిగే శక్తి టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందని తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజల్లో వేవ్ జగన్కు అనుకూలంగా ఉందని చెప్పారు. కానీ ఆ వేవ్ మార్చగల శక్తి, సామర్థ్యం చంద్రబాబుకు ఉందని చెప్పారు. జగన్కు సరైన ఎన్నికల బృందం లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో అయిదారేళ్లు పట్టవచ్చునని చెప్పారు.

పవన్ కళ్యాణ్ బలం ఇప్పుడే అంచనా వేయలేం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. పవన్ ఇప్పుడే పూర్తిస్థాయి రాజకీయ ఆరంగేట్రం చేశారని, కాబట్టి ఆయన బలంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని చెప్పారు. ఆయన బలం ఏమిటో ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. నిధుల గురించి జనసేన ఇచ్చిన రిపోర్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదన్నారు.

ప్రత్యేక హోదాను అప్పుడే అడగాల్సింది
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడు మండలాలను విలీనం చేసినప్పుడే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పట్టుబట్టాల్సింది అని ఉండవల్లి చెప్పారు. ఇప్పుడు చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పారు.

రెండు పార్టీల్లో మిత్రులు
తనకు వైయస్సార్ కాంగరెస్ పార్టీతో పాటు, టీడీపీలో కూడా మిత్రులు ఉన్నారని ఉండవల్లి చెప్పారు. కడప స్టీల్ ప్లాంటు పైన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తాను చేసే దీక్షకు నా మద్దతు కోరితే తప్పకుండా ఇస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై తిరగబడాలని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పానని, కానీ అది చేయకుండా చంద్రబాబు యాక్షన్ చేస్తున్నారన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబు కేంద్రానికి నోటీసులు ఇవ్వాలివ్వాలని సూచించారు.

కేంద్రానికి నోటీసులు ఇవ్వకుంటే భవిష్యత్తు కార్యాచరణ
టీడీపీ నోటీసులు ఇవ్వకుంటే తాము భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని ఉండవల్లి చెప్పారు. విభజన కాంగ్రెస్, బీజేపీలు కలిసి చేశాయన్నారు. నాలుగేళ్లు ఎన్డీయేలో కలసి ఉన్న చంద్రబాబు ఇప్పుడు విడిపోయామంటున్నారని, ఏ పార్టీపైనా తనకు శత్రుభావం లేదని చెప్పారు. హోదా కావాలో, ప్యాకేజ్ కావాలో తేల్చుకోలేని డైలమాలో చంద్రబాబు ఉండిపోయారన్నారు. అందుకే పలుమార్లు మాట మార్చారన్నారు. ఏదో ఒకదానిపై చంద్రబాబు స్థిరంగా ఉండాల్సిందన్నారు. అధికారం కోసం పెట్టుబడులు పెట్టి తర్వాత లాభం తీసుకుంటున్నారని, ఈ విధానాన్ని మార్చే ప్రయత్నం జరగాలన్నారు. పథకాలకు ఆన్లైన్లో పాస్వర్డ్ విధానం తీసేయాలని, దీంతో వేటికి ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications