వివేకా కేసులో మీ ప్రవర్తన ఎలా ఉందో అర్థమవుతోంది!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారించాలని ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం విచారణ జరిపింది. సాక్షులకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేని దుస్థితిలో ఉందని సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 1+1 భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. '1+1 భద్రత సరిపోతుందా? ఈ కేసులో మీ ప్రవర్తన ఎలా ఉందో దీన్ని బట్టే అందరికీ అర్థమవుతోంది' అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. కేసు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసును ఏపీ బయట విచారించాలని ఆయన కుమార్తె సునీత కోర్టుతున్నారు. దీనిపై ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అప్రూవర్ గా మారిన దస్తగిరికి ప్రాణభయం వెంటాడుతోంది. తన గన్ మెన్లను మార్చారని, తమ పెంపుడు కుక్క చనిపోయిందని, ఆ తర్వాత తాము ఇంట్లో లేని సమయంలో ఇన్నోవా కారులో ఆరుగురు వ్యక్తులు వచ్చి కుక్కను అమ్ముతారా? అని అడిగి వెళ్లారంటూ దస్తగిరి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెండురోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆయన ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ తరుణంలోనే 19వ తేదీకి వాయిదా పడిన విచారణలో ఎటువంటి తీర్పు వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.