Union Budget 2022: విశాఖకు క్లియరెన్సా- వెయిటింగ్ లిస్టేనా : నేటి రైల్వే బడ్జెట్ పై ఎన్నో ఆశలు..!!
ఈ సారి కేంద్ర బడ్జెట్ లో ఏపీ వినతులకు మోక్షం లభిస్తుందని అధికార పార్టీ నేతలు ఆశిస్తున్నారు. సాధారణ బడ్జెట్ తో పాటుగా రైల్వే బడ్జెట్ ను సైతం కలిపి ప్రతిపాదించనున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి పలు వినతులు కేంద్రానికి అందాయి. అందులో ఎన్నిటికి ఆమోదం లభిస్తుందనేది నేటి బడ్జెట్ లో క్లారిటీ రానుంది. ఏపీకి రైల్వే బడ్జెట్ లో కేటాయింపుల పైన దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఏపీ ఎంపీలు పలు డిమాండ్లు ప్రతిపాదించారు.
విశాఖ జోన్ పై క్లారిటీ ఇస్తారా
ఎంపీలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేసిన విశాఖపట్నం రైల్వేజోన్ పై ఈ సారైన క్లారిటీ ఇస్తారా.. ఇంకా, డైలమా కొనసాగిస్తారా అనేది ఈ సారి బడ్జెట్ లో ఏపీ ప్రజలు ఆశగా చూస్తున్న అంశం. 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా 'దక్షిణ కోస్తా రైల్వేజోన్' ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది.
మరోవైపు.. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్ను సిద్ధంచేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. కానీ, గత రెండు బడ్జెట్లలోనూ రైల్వేజోన్పై కేంద్రం మొండిచేయి చూపించింది. ప్రభుత్వం అనుమతిస్తే దక్షిణా కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసేందుకు రైల్వేబోర్డు సిద్ధంగా ఉంది.
రాజకీయ నిర్ణయమే కీలకం
కానీ, జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వమే రాజకీయంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైల్వేజోన్పై కేంద్రం స్పష్టతనివ్వాలని రాష్ట్రం కోరుకుంటోంది. కేంద్రం ఇప్పుడు ప్రకటిస్తే ఏడాదిలో కొత్త జోన్ ఏర్పాటు సాధ్యపడుతుంది.
ప్రస్తుతం కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకుంటే ఇక రైల్వేజోన్ అంశం అటకెక్కినట్లుగానే భావించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి కనీసం రెండు కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం-బెంగళూరు, తిరుపతి-వారణాసి సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది.ఇక విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి రాజధాని ఎక్స్ప్రెస్ వేయాల్సి ఉంది.
కొత్త రైళ్ల కోసం వినతులు
విజయవాడ నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతికి పగటిపూట నడిచే రైళ్లు కూడా వేయాలని ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్ల సెకండరీ మెయింటెనెన్స్ లోకోషెడ్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు 100 ఎకరాలు కేటాయిస్తామని కూడా చెప్పింది. దాంతో రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. విజయవాడ-ఖరగ్పూర్ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుచేస్తామని గత బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. కానీ, ఇంతవరకు పట్టించుకోలేదు. ఆ కారిడార్ కోసం ప్రత్యేకంగా లైన్ నిర్మించే అంశంపై మంగళవారం బడ్జెట్లో స్పష్టతఇవ్వాలని కోరుకుంటోంది. ఇక, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ను రద్దు చేస్తున్నట్టు చెప్పింది.
Recommended Video
ఏపీకీ ఏ మేర దక్కేను
దీనిపై ఉత్తరాంధ్రలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. వాల్తేరు డివిజన్లేని రైల్వేజోన్తో ప్రయోజనంలేదని స్పష్టంచేశారు. వాల్తేరు డివిజన్తో కూడిన విశాఖపట్నం రైల్వేజోన్ మాత్రమే కావాలని స్పష్టంచేస్తున్నారు. అంతగా కావాలంటే విజయవాడ, గుంటూరులలో ఉన్న రైల్వే డివిజన్లను ఏకంచేసి ఓ డివిజన్ చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక, ఈ సారైన రైల్వే బడ్జెట్ లో కేంద్రం.. ఏపీ ప్రతిపాదనలు... పెండింగ్ అంశాల పైన ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.