Union Budget 2022: సీఎం జగన్ కు ఊరట దక్కేనా - బడ్జెట్ పై ఎన్నో ఆశలు : ఏపీ కోరుతోంది ఏంటి..!!
ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే సీఎం జగన్ నేరుగా ప్రధాని మోదీతో సహా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా... పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వివరించారు. కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు. ఇక, ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. దీంతో నిర్మలమ్మ పద్దులతో ఏపీకి ఎటువంటి ఎలాంటి ప్రాధాన్యత దక్కనుందనే దాని పైన ఏపీ ప్రభుత్వం నిరీక్షిస్తోంది. ప్రధానంగా ఈ బడ్జెట్ లో ఏపి ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును ఆశిస్తోంది.
Recommended Video
పోలవరానికి నిధులు దక్కేనా
అందులో ప్రధానంగా ఏపీ జీవనాడిగా మారిన పోలవరంను కేంద్రం ఏడేళ్ల క్రితం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ప్రాజెక్టు పూర్తి చేయటానికి రూ 55,548 కోట్లకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. రానున్న ఆర్దిక సంవత్సరం 2022-23 లో ప్రాజెక్టుకు రూ 10,900 కోట్లు అవసరమని ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే, ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో పోలవరం రీయంబర్స్ మెంట్ కింద ఏపీకి కేవలం రూ 1,070 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రెవిన్యూ లోటు భర్తీ పైన కేంద్రం హామీ ఇచ్చింది.
రెవిన్యూ లోటు భర్తీ కోసం
2014-15 రెవిన్యూ లోటు భర్తీ నిధులు ఇప్పటికీ ఏపీకి పూర్తిగా దక్కలేదు. దీని పైన అటు కేంద్రం..ఇటు ఏపీ ప్రభుత్వం నాటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, రెవిన్యూ లోటు కింద ఏపీకి రావాల్సిన రూ 18,830 కోట్లు అవసరమంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీంతో పాటుగా.. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కేటాయించిన వాటికి నిధులు లేవు. మరి కొన్నింటికి అసలు అనుమతులే ఇప్పటికీ దక్కలేదు. అందులో భాగంగా భోగాపురం విమానాశ్రయం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టుకు అనుమతులు..ఆర్దిక సాయం పైన పలు మార్లు రాష్ట్రం కేంద్రానికి లేఖలు రాసింది. ప్రత్యక్షంగా వినతులు అందించింది.
కడప ఉక్కు ఫ్యాక్టరీ పైనా ఆశలు
కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు మైనింగ్ లీజులు రిజర్వ్ చేసి.. నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరింది. రాయలసీమ - ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాల కింద డెవలప్ మెంట్ ఫండ్స్ కోసం పునర్విభజన చట్టంలోనే హామీ ఇచ్చారు. ఈ మేరకు దాదాపుగా ఏపీకి రూ 23 వేల కోట్లు రావాల్సింది. దీని పైన ఏపీ ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. ప్రస్తుతం ఏపీ పూర్తిగా ఆర్దిక కష్టాల్లో ఉంది. కేంద్రం నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకొని అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభం వరకూ కొత్త అప్పులు పుట్టే అవకాశాలు లేవు.
సీఎం జగన్ వినతులు పరిష్కరించేనా
దీంతో.. వచ్చే ఆర్దిక సంవత్సరంలో అయినా ఆర్దిక కష్టాల నుంచి గట్టెక్కాలేంటే కేంద్రం ఈ బడ్జెట్ లో చేసే ప్రతిపాదనల పైన సీఎం జగన్ నాయకత్వంలోనే ఏపీ ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది. ప్రత్యేక కేటాయింపులు కావాలని కోరుతున్నా.. కనీసం, ఇచ్చిన హామీల అమలు... రావాల్సిన పెండింగ్ నిధుల మంజూరు..ఏపీకి ప్రాజెక్టుల కేటాయింపు పైన అయినా కనీసం నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ఏపీ పైన ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనే అంశం పైన ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. ఈ బడ్జెట్ పైన ఏపీ ప్రభుత్వం ఆశలు ఎంత వరకు ఫలితస్తాయో వేచి చూడాలి.