ఏపీలో నరేంద్రమోడీ రయ్.. రయ్..
కేంద్రంలో, రాష్ట్రంలో.. రెండుచోట్లా ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ కు అదృష్టం కలిసివస్తోంది. దీనికితోడు లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలవల్లే కేంద్రం మనుగడ ఆధారపడివుండటం కూడా మరో కారణం. దీంతో ప్రభుత్వం ఏది అడిగితే అది ఎంతో ఉదారంగా నరేంద్రమోడీ, అమిత్ షా ఇచ్చేస్తున్నారు. అన్యాయంగా రాష్ట్రం విభజించబడిందని, అభివృద్ధి చేసుకోవడానికి ఇంతకుమించిన తరుణం రాదని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు ప్రతిపాదనలను కేంద్రం ముందు పెడుతున్నారు. వీటిల్లో జాతీయ రహదారుల విస్తరణ ప్రధానమైంది. రాష్ట్రాభివృద్ధికి రహదారుల విస్తరణ ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారుకానీ అందుకు తగ్గ నిధులు రాష్ట్రం దగ్గర లేవు. కేంద్రంపైనే ఆధారపడాల్సి ఉంది.
వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా
2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు నుంచి ఆకివీడు మీదుగా దిగమర్రు వరకు జాతీయ రహదారి మంజూరైంది. తొలి దశలో 60 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. రెండోదశలో ఆకివీడు నుంచి దిగమర్రు వరకు ఉన్న 42 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా 12 చోట్ల వంతెనలు నిర్మిస్తారు. గ్రామాల దగ్గర వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా వీటిని నిర్మించనున్నారు. ఆకివీడు నుంచి వీరవాసరం మధ్యలో బైపాస్ ఉంటుంది.

రెండు జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి
ప్రస్తుతం ఉన్న రహదారిలో 13 కిలోమీటర్లు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు. కేంద్రం పచ్చజెండా ఊపడంతో సర్వే పనులు జరుగుతున్నాయి. మార్చిలో టెండర్లు పిలవబోతున్నారు. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఆమోదిస్తే కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి. రెండువారాల్లో డీపీఆర్ ను పూర్తిచేయాలని భావిస్తున్నారు. హైవేకు అవసరమైన భూమిని గుర్తించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉంది. ఉండి, భీమవరం, పొలకొల్లుమీదుగా జాతీయ రహదారి ఉండటంవల్ల రొయ్యల పరిశ్రమకు మంచిరోజులు వస్తున్నాయంటున్నారు. ఒకరకంగా ఈ జాతీయ రహదారితో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రూపురేఖలు మారిపోతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications