ఏపీకి అద్భుతమైన వరాన్ని ప్రకటించిన నరేంద్రమోడీ
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వరం ప్రకటించింది. కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఏపీకి లెక్కలేనని వరాలను కేంద్రం ప్రకటిస్తోంది. అందుకు కారణం ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీలమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడివుండటం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కొవ్వూరు-భద్రాచలం రైలు మార్గానికి మార్గాన్ని సుగమం చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్ ను కేటాయించింది. రైల్వే లైను మంజూరు చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. రాజమండ్రి పురంధేశ్వరికి ఈ విషయాన్ని మంత్రి లేఖద్వారా తెలియజేశారు.
పురంధేశ్వరికి మంత్రి లిఖితపూర్వక సమాధానం
ఆర్థికంగా వెనకబడిన ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైను ఉండబోతోంది. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుంది. పనులన్నీ దశలవారీగా సాగుతాయి. దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రైల్వే లైనుకు సంబంధించి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కొవ్వూరు-భద్రాచలం మార్గానికి రూ.2,155 వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఏపీకి, తెలంగాణకు మధ్య దూరం తగ్గుతుంది. సత్తుపల్లి, దేవరపల్లికి సమాంతరంగా టి.నర్సాపూరం, పుట్టగట్ల గూడెంమీదుగా రైల్వే లైను నిర్మిస్తారు.

ఏడు దశాబ్దాల క్రితమే నిర్మించాలి
వాస్తవానికి ఈ రైల్వే లైను ఏడు దశాబ్దాల క్రితమే నిర్మించాల్సి ఉంది. అయితే ఈ మార్గం మొత్తం అటవీ ప్రాంతం కావడంతోపాటు 120 వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరుగుతుంది. అప్పటికి దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. సత్తుపల్లిలో బొగ్గు గనులు బయటపడటంతో వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రైల్వే మార్గం ఒకటే మంచి మార్గమని భావించి రైల్వే లైను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ మార్గం సర్వే కోసం రూ.40 కోట్లు కేటాయించినప్పటికీ పనులు మాత్రం అంగుళం కూడా జరగలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుండటంతోపాటు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. రానున్న ఐదు సంవత్సరాల్లో కొవ్వూరు-భద్రాచలం మధ్య రైలు కూత పెట్టనుంది.












Click it and Unblock the Notifications