ఏపీకి అమిత్ షా - తిరుపతి వేదికగా : వైసీపీ..టీడీపీ నేతల వెయిటింగ్ - ఏం జరగబోతోంది..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ 14న ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు.

అమిత్ షా పర్యటన అధికారికంగా
ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం తదితరాలపై చర్చిస్తారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. ఈ సమావేశంలో గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సమయంలోనే జరగాల్సి ఉంది. కానీ, ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ సారి జరిగే సమావేశం లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

రాజకీయంగానూ ఆసక్తి కరంగా
ఇక, ఏపీకి వస్తున్న అమిత్ షా పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. ముఖ్యమంత్రి జగన్ పైన టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు .. ఆ తరువాత టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటనలతో కేంద్రం వద్దకు రెండు పార్టీల నేతల ఫిర్యాదులు పోటా పోటీగా చేసుకుంటున్నాయి. పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. పార్టీ కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఇక, రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడ రాష్ట్రపతితో పాటుగా హోం మంత్రి అమిత్ షా తోనూ సమావేశం కావాలని భావించినా...ఆయన నుంచి సమయం దొరకలేదు.

వైసీపీ..టీడీపీ నేతల పోటీపోటీగా...
దీంతో..తాజాగా ఫోన్ లోనే చంద్రబాబు కేంద్ర హోం మంత్రికి అన్ని విషయాలు వివరించారు. ఇక, తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్ర హోం మంత్రిని కలిసి ఇవే అంశాల పైన ఫిర్యాదు చేసారు. తిరుపతి లో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా టూర్ లో భాగంగా ఏపీలో రాజకీయ అంశాల పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ - జనసేన పొత్తు వ్యవహారం లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది.
Recommended Video

ఏపీ రాజకీయాల పైన షా ఫోకస్
గతంలో అమిత్ షా ఇదే సమావేశం కోసం తిరుపతి వచ్చిన సమయంలో కలవాలని జనసేన అధినేత పవన్ భావించారు. అయితే, సమావేశం రద్దు కావటంతో కలవలేదు. ఇక, ఇప్పుడు కేంద్రం నిర్ణయించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా జరిగే సభలో పవన్ పాల్గొంటున్నారు. అదే విధంగా బద్వేలులో బీజేపీ కి మద్దతుగా పవన్ ప్రచారం చేయలేదు. ఇక, ఏపీ సీఎం జగన్ సైతం ఈ పర్యటనలో అమిత్ షా ను ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉంది. టీడీపీ నేతలు సైతం పదే పదే తమ పార్టీ అధినేతకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలంటూ అమిత్ షా ను కోరుతున్నారు. దీంతో.. ఆయనకు సైతం తిరుపతిలోనే సమయం కేటాయిస్తారా.. ఈ లోగా ఢిల్లీలో కలుస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో అమిత్ షా పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications