టీబీజేపీ నేతలపై షా సీరియస్ - ఎంపీలుగా ఆ నలుగురికి గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణలో లోక్ సభ సీట్ల పైన బీజేపీ ఫోకస్ చేసింది. మెజార్టీ లోక్ సభ సీట్లు సాధించే క్రమంలో తెలంగాణ పార్టీ బాధ్యతలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వీకరించారు. హైదరాబాద్ వచ్చిన అమిత్ షా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యనేతల మధ్య కోల్డ్వార్పై అమిత్ షా సీరియస్ అయ్యారని సమాచారం. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని నిర్దేశించారు. లోక్ సభలో పోటీ చేసేందుకు నలుగురు సిట్టింగ్ ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమిత్ షా నిర్దేశం : రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో గతం కంటే స్థానాలు, ఓట్ షేర్ పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని నేతలకు సూచించారు. బీజేపీ ముఖ్యనేతల మధ్య కోల్డ్వార్పై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేసారు. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని కోరినట్టు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్రెడ్డిని ఆదేశించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయవద్దని స్పష్టం చేసారు.

పార్టీ నేతలపై ఆఘ్రహం : అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య గ్యాప్ కారణంగా పార్టీ దెబ్బతిందని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు సమాచారం. తెలంగాణలో లోక్ సభ సిట్టింగ్ ఎంపీలు అదే స్ధానంలో పోటీ చేసేందుకు అమిత్ షా అంగీకారం తెలిపారు. నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల పైన పార్టీ నేతలు అమిత్ షా కు వివరాలు అందించారు. పూర్తి సమాచారం తాము సేకరించామని..పార్టీ నేతల మధ్య అనైక్యత మంచిది కాదని చెప్పుకొచ్చారు. తాజాగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని..తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇలాంటివి మరోసారి జరగకూడదని తేల్చి చెప్పారు.

శాసనా సభ పక్ష నేతపై క్లారిటీ : బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై అమిత్ షా సమావేశంలో చర్చ జరిగింది. బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బావుంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉండే అవకాశం ఉంది. పరస్పర విమర్శలు ఆపి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. భేటీ వేళ బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేసిన అంశాన్ని ఈటెల ప్రస్తావించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత అమిత్ షా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications