విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కేంద్ర హోం శాఖ షాకింగ్ నిర్ణయం..!
విజయనగరంలో వెలుగులోకి వచ్చిన ఉగ్రకుట్ర కేసు రాష్ట్రంలో కుదిపేసింది. ఈ కేసులో సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29), సయ్యద్ సమీర్ (28) అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. రెహ్మాన్ విజయనగరానికి చెందిన వ్యక్తి కాగా.. సమీర్ హైదరాబాద్ బోయగూడకు చెందిన వ్యక్తి. వీరిద్దరూ ఉగ్రవాద కుట్రలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా వీరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయినట్టు గుర్తించారు. ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమై, దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని తేల్చారు. ఈ క్రమంలోనే ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యంత సీరియస్గా తీసుకుని కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.
మే 16న విజయనగరం టూ టౌన్ పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేయగా.. అనంతరం కోర్టులో కస్టడీ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం అంగీకరించి వారిని వారం రోజులపాటు విచారణకు అనుమతించింది. ఈ క్రమంలో NIA, యాంటీ బాంబ్ స్క్వాడ్, ఇతర టెర్రరిస్ట్ నిరోధక విభాగాలు కలిసి వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాయి. విచారణ అనంతరం మరోసారి రిమాండ్ విధించడంతో వారిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

సిరాజ్, సమీర్లు హైదరాబాద్, విజయనగరం, అలాగే దేశంలోని ఇతర నగరాలు అయిన చెన్నై, ముంబై, ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. వీరికి ఆదేశాలు ఇస్తున్న హ్యాండ్లర్ ఇమ్రాన్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నాడని భావిస్తున్నారు. ఇమ్రాన్ పంపిన డబ్బుతోనే సిరాజ్ పేలుడు పదార్థాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశాడని.. విజయనగరంలోని రంపచోడవరం అడవిలో డమ్మీ బ్లాస్ట్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అలానే సిరాజ్ ఇంట్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో కేసు మరింత లోతుగా దర్యాప్తు అవసరమని భావించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, అధికారికంగా కేసును NIAకి బదిలీ చేసింది. త్వరలోనే సిరాజ్, సమీర్లను NIA అధికారిక కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఇంతవరకూ వీరిద్దరినిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలో NIA అధికారులు పెద్ద ఎత్తున దాడులు జరిపారు. ఇందులో 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక ఉన్న అంతర్జాతీయ ఉగ్ర సంబంధాలను నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications