మూడు రాజధానుల అంశంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .. ఏం చెప్పారంటే
ఏపీ రాజధాని అమరావతిని తరలించాలని ఏపీ సర్కార్ భావిస్తున్న నేపధ్యంలో రాజధాని అమరావతిలో ఉద్రిక్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు .హైదరాబాద్లో పౌరసత్వ సవరణ చట్టం పై అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయం వెల్లడించారు .

ఇండియా మ్యాప్ లో అమరావతికి స్థానం కల్పించటానికి కృషి చేశానన్న కిషన్ రెడ్డి
ఏపీకి మూడు రాజధానులు అంటున్నారని, అలా జరిగితే అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంటుందనికేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని ఇండియా మ్యాప్ లో పెట్టేందుకు తన శాయశక్తులా సహకారం అందించానని చెప్పిన కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చెయ్యాలని పేర్కొన్నారు .రాజధానిపై కమిటీలు వేశామని చెప్తున్న ఏపీ సర్కార్ కమిటీల నివేదికలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అధికారిక నిర్ణయం ప్రకటించాకే స్పందిస్తామన్న కేంద్ర మంత్రి
ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చిన విషయంలో తాను ప్రధాన మంత్రి, హోం మంత్రిలతో మాట్లాడి ఏపీ రాజధానికి ఇండియా మ్యాప్ లో స్థానం కల్పించేలా చేశానని ఆయన చెప్పారు. ఇక ఇప్పుడు రాజధాని మార్చాలన్న నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఏవో తెలీటం లేదన్నారు . రాజధానిపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు వెల్లడించిన తర్వాత బీజేపీ రాజధాని విషయంలో తన అభిప్రాయం స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు.

సంయమనం పాటించాలని బీజేపీ నేతలకు సూచన
అప్పటి దాకా బీజేపీ నేతలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు . సీఎం జగన్ ప్రకటన తర్వాత బీజేపీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకత్వంతో చర్చించి పార్టీపరంగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశం అని ఆయన చెప్పారు. కానీ మూడు రాజధానులు అనే అంశాన్ని ఎలా అమలు చేయబోతున్నారు. మూడు చోట్ల పాలన ఎలా సాధ్యం అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

మూడు రాజధానుల విధివిధానాలు తెలిశాకే మాట్లాడతాం
ఇక రాష్ట్రం మూడు రాజధానుల విధి విధానాలేమిటి.. అన్న అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతనే తాను కేంద్ర మంత్రిగా తన అభిప్రాయం వెల్లడిస్తానని చెప్పారు కిషన్ రెడ్డి . ఏది ఏమైనా బీజేపీ నేతల మధ్య రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకా కేంద్రం రాజధాని విషయంలో ఏ మాత్రం క్లారిటీకి రాలేదని అర్ధం అవుతుంది. జగన్ తుది నిర్ణయం వెల్లడించాక తమ నిర్ణయం చెప్తామని అన్నారు కిషన్ రెడ్డి .












Click it and Unblock the Notifications