జగన్ వల్ల దేశానికి చెడ్డపేరు రావొద్దు.. నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్.. ఏపీకి భారీగా నిధులు..
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీల గురించి విని తాను షాకయ్యానని, దేశంలో ఎక్కడాలేని విధంగా యూనిట్ కు రూ.9 వసూలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను.. వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్ ను ఉద్దేశించి మంత్రి అనూహ్య కామెంట్లు చేశారు.
Recommended Video

బీజేపీ జన సంవాద్ ర్యాలీ..
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘జన సంవాద్' పేరుతో ర్యాలీలు నిర్వహిస్తుండటం తెలిసిందే. కరోనా కారణంగా వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఏపీకి కేంద్రం చేస్తోన్న మేలుల దగ్గర్నుంచి సీఎం జగన్ తప్పులు, చంద్రబాబు పాలనలో అవినీతిపై విచారణ.. తదితర అంశాలపై ఆమె మాట్లాడారు.

దేశానికి చెడ్డపేరు రాకుండా..
‘‘కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ను రూ.2.70కే అందిస్తోంది. కానీ ఏపీలో మాత్రం యూనిట్ కు రూ.9 వసూలు చేస్తునట్లు విని ఆశ్చర్యపోయాను. అంత పెద్ద మొత్తాన్ని వసూలు చేస్తే ప్రజలు ఎలా బతుకుతారు? అదీగాక, జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్(పీపీఏ)లను రద్దు చేశారు. వరల్డ్ బ్యాంక్ నిధులతో నడిచే ప్రాజెక్టులు, అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాల విషయంలో రాష్ట్రాలు ఇలా వ్యవహరిస్తే ఎలా? ఏపీ ప్రభుత్వ చర్యలతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు, చెడ్డపేరు రాకుండా చూసుకోవాలి కదా..'' అని నిర్మల హితవు పలికారు.

ఏపీకి భారీగా నిధులు.. ప్రాజెక్టులు..
ఆంధ్రప్రదేశ్ పట్ల మోదీ సర్కారుకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, కాబట్టే తక్కువ సమయంలో భారీగా నిధులు, కొత్త ప్రాజెక్టులను మంజూరు చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కోవిడ్ ఫైట్ కింద ఏపీకి మూడు నెలల వ్యవధిలోనే రూ.8,025 కోట్లు ఇచ్చామని, రాష్ట్రానికి చెందిన 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.936కోట్లు జమ చేశామని తెలిపారు. ఏపీలోని 546 మత్స్యాకార గ్రామాల్లో 349 పిషింగ్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటు, ఆక్వా, మెరైన్ ఫిషింగ్కు మరో రూ. 11 వేల కోట్ల కేటాయింపులను కూడా ఆమె ఉదహరించారు.

చంద్రబాబు అవినీతిపై..
ఏపీలో గత టీడీపీ పాలనతో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై జగన్ సర్కారు చర్యలకు ఉపక్రమించిన దరిమిలా ఆ ప్రయత్నాలను కేంద్ర మంత్రి నిర్మల స్వాగతించారు. అవినీతిపై పోరాటం అనేది ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన వ్యవహారమని, నిందితులు ఎంతటివారైనా కేసులు పెట్టి విచారణ చేయాలని ఆమె సూచించారు. అమరావతిలో భూదందా మొదలుకొని, వెల్ఫేర్ స్కీముల్లో అవకతవకలదాకా కేబినెట్ సబ్ కమిటీ కీలక రిపోర్టులను రూపొందించడం, ఆమేరకు సీఐడీ విచారణ జరుగుతుండగా, చంద్రబాబుపై సీబీఐ విచారణకు కూడా జగన్ సర్కారు కోరడం తెలిసిందే.

ఆ నలుగురే మహానాయకులా?
బీజేపీ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఏపీలో రాజకీయ పరిణామాలపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రాంతీయ పార్టీల కారణంగా రాష్ట్రం వెనుకబడిందని, అవినీతి నిర్మూలన అంశాన్ని కుల రాజకీయాలకు వాడుతున్నారని ఆరోపించారు. ‘‘ఎన్టీఆర్, చంద్రన్న, వైఎస్సార్, జగనన్న... వీళ్లేనా మహానాయకులు? అంటూ మండిపడ్డారు. దేశం కోసం ప్రకాశం పంతులు, వీరేశలింగం వంటి వారు దేనికైనా సిద్ధపడ్డారని, ఇలాంటి వాళ్లు కనిపించరా..?'' అని జీవీఎల్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications