విశాఖలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ...
విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్పీ) ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కేంద్రం దృష్టి సారించింది. ప్రస్తుతం దీనిపై ప్రాథమిక అధ్యయనం జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వివరాలు వెల్లడించారు.
ఇప్పటికే విజయవాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనం పూర్తయిందని నితిన్ గడ్కరీ తెలిపారు.అయితే అక్కడ ఆశించినంత డిమాండ్ లేదని అధ్యయనంలో తేలిందన్నారు. త్వరలోనే విశాఖపట్నంకు సంబంధించిన అధ్యయనం కూడా పూర్తవుతుందన్నారు. ఎంఎంఎల్పీ ఏర్పాటు కావాలంటే ముందు ఆ ప్రాంతంలో సప్లై, డిమాండ్, ఆచరణ సాధ్యత వంటి అంశాలపై ప్రాధమిక అధ్యయనం జరుగుతుందన్నారు.
దేశంలోని 35 నగరాల్లో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ నగరాలు ఉన్నాయి. అయితే విజయవాడలో ఎంఎంఎల్పీ ఏర్పాటుకు తగిన పరిస్థితులు లేవని తేలిపోవడంతో ఇక విశాఖలోనైనా అందుకు అవకాశం ఉంటుందా ఉండదా అన్నది వేచి చూడాలి.
గతేడాది అక్టోబర్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.694 కోట్లతో అసోంలోని గువాహటిలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్కు శంకుస్థాపన చేశారు. అసోం ఆర్థికాభివృద్దికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. మొదటి దశలో అసోంలోని జోగిగొపాలో 317 ఎకరాల్లో దీనికి సంబంధించిన నిర్మాణాలు జరగనున్నాయి. ఈ లాజిస్టిక్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా,పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. ఎంఎంల్పీ ప్రాజెక్టు ద్వారా గోదాములు,రైల్వే సైడింగ్,కోల్డ్ స్టోరేజీ,కస్టమ్ క్లియరెన్స్ హౌస్,యార్డ్ ఫెసిలిటీ,వర్క్ షాప్స్,పెట్రోల్ పంప్స్,ట్రక్ పార్కింగ్,అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్,బోర్డింగ్ లాడ్జింగ్,ఈటింగ్ జాయింట్స్,వాటార్ ట్రీట్మెంట్ ప్లాంట్ తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.