టెన్షన్: ఆళ్ళగడ్డలో సుబ్బారెడ్డిపై రాళ్ళదాడి, మంత్రిపై ఫిర్యాదు, పోటాపోటీ
ఆళ్ళగడ్డ: కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నాడు రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంత్రిపై పోలీసులకు ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.
అఖిలతో విబేధాలు నిజమే, ఆళ్ళగడ్డలో పోటీ, పార్టీ కోసమే: ఏవీ సుబ్బారెడ్డి సంచలనం
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నేతల మధ్య గొడవలు బహిర్గతమయ్యాయి. ఆళ్ళగడ్డ నుండి తాను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ఇటీవలనే ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
భూమా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు కూడ ఏవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం అందలేదు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి చిరకాల మిత్రుడు,. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య పొరపొచ్చాలు చోటు చేసుకొన్నాయి. రోజు రోజుకూ ఈ విభేధాలు పెరిగిపోతున్నాయి.
ఏపీ సుబ్బారెడ్డిపై ఆళ్ళగడ్డలో దాడి
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట దగ్గర ఏవీ సుబ్బారెడ్డిపై కొందరు వ్యక్తులు రాళ్ళతో దాడికి దిగారు. మంత్రి భూమా అఖిలప్రియ వర్గీయులే తనపై దాడికి పాల్పడ్డారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి అఖిలప్రియ పోస్టర్ ఉన్న వాహనంపై వచ్చిన దుండగులు దాడికి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే దాడికి పాల్పడిన వారిలో ఒకరిని సుబ్బారెడ్డి వర్గీయులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే
భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రి అఖిలప్రియ తనను దూరం పెడుతోందనే భావనతో టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాలకు చెందిన కౌన్సిలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అఖిలప్రియపై విమర్శలు చేశారు. అయితే ఆ సమయంలో ఎన్నికలను పురస్కరించుకొని పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకుగాను సుబ్బారెడ్డి, అఖిలప్రియను పిలిపించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఎన్నికల్లో సుబ్బారెడ్డి భూమా బ్రహ్మానందరెడ్డి కోసం పనిచేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా పోయింది.
భూమా, ఏవీ సుబ్బారెడ్డి మధ్య పెరుగుతున్న గ్యాప్
భూమా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి గత మాసంలో ఆళ్ళగడ్డలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నేతలు, రాష్ట్ర మంత్రులు, కార్పోరేషన్ ఛైర్మెన్లు, ప్రజాప్రతినిధులు, భూమా సన్నిహితులు హజరయ్యారు. కానీ, ఏవీ సుబ్బారెడ్డికి ఈ వర్ధంతి సభకు ఆహ్వానం అందలేదు. తనకు ఈ వర్ధంతి సభకు ఆహ్వానం అందించకపోవడాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు. తాను ఆళ్ళగడ్డలోనే పుట్టానని అందుకే అవసరం ఉన్నవారు తనకు ఫోన్ చేయాలని ఆళ్ళగడ్డలో సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పొచ్చారు. ఈ సమావేశానికి ఎవరూ కూడ వెళ్ళొద్దని మంత్రి ఆదేశాలు చెప్పినా కొందరు ఈ సమావేశానికి వెళ్ళారు. ఆళ్ళగడ్డను కేంద్రంగా చేసుకొని తాను కూడ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ చేసుకోవడం భూమా అఖిలప్రియకు ఇబ్బంది కల్గిస్తోంది. దీంతో రెండు వర్గాలు ఆమితుమీ తేల్చుకొనేందుకు సిద్దమయ్యాయి.
సయోధ్య కుదర్చకపోతే ఇబ్బందేనా
ఆళ్ళగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విభేధాలపై పార్టీ నాయకత్వం సయోధ్య కుదర్చకపోతే ఇబ్బందులు తప్పవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున పార్టీలోని ఇద్దరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం వంటి పరిణామాలు రాజకీయంగా ప్రత్యర్దులకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదంటున్నారు.ధర్మపోరాట దీక్ష సందర్భంగా అఖిలప్రియ ఒకచోట, ఏవీ సుబ్బారెడ్డి మరో చోట దీక్షకు దిగారు.