తెలివి గల వాడు బాలకృష్ణ..!!
అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తోన్న 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్పై అందరి దృష్టీ నిలిచింది. చీఫ్ గెస్ట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడమే దీనికి కారణం. అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ మధ్యాహ్నం షూటింగ్ ఆరంభమైంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమౌతుంది.

చంద్రబాబుతో షురూ..
ఈ టాక్ షో సెకెండ్ సీజన్- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో ఆరంభమైంది. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ దీనికి హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ టాక్ షోలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్నాయి. పూర్తిస్థాయిలో షూటింగ్ ముగిసిన తరువాత అధికారికంగా దీనికి సంబంధించిన ప్రోమోలను గీతా ఆర్ట్స్ విడుదల చేస్తుంది.

విమర్శలు షురూ..
పవన్ కల్యాణ్ అలా ఈ అన్స్టాపబుల్ 2 షోలో పాల్గొన్నారో లేదో.. ఇలా విమర్శల సునామీ మొదలైంది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు- పవన్ కల్యాణ్పై ఘాటు విమర్శలు సంధించారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన షోలో పాల్గొనడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపలేదని, ఇప్పుడు బాలయ్య బాబు కోసం జమ్మ కట్టారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు. రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా? అంటూ అంబటి రాంబాబు పవన్ కల్యాణ్కు చురకలు అంటించారు.

పేర్ని నాని ఫైర్..
తాజాగా మాజీమంత్రి పేర్ని నాని కూడా పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణపై సెటైర్లు వేశారు. గతంలో తన తండ్రి ఎన్టీ రామారావుకు పదవీచ్యుతుడిని చేయడంలో నందమూరి బాలకృష్ణ భాగస్వామి అయ్యాడని, తన అక్కలు, బావలు, అన్నలను అడ్డుగా పెట్టుకున్నాడని విమర్శించారు. ఇప్పుడు మరోసారి అల్లు అరవింద్ పుణ్యమా అంటూ ఆహా ఓటీటీలో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తోన్నాడని ధ్వజమెత్తారు.

బావ చేసిన తప్పులను..
ఈ అన్స్టాపబుల్ కార్యక్రమం ద్వారా తన బావ చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు బాలకృష్ణ మసిపూసి మారేడు కాయ చేస్తోన్నాడని పేర్ని నాని మండిపడ్డారు. ఈ విషయంలో ఆయన చాలా తెలివైనవాడంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీ రామారావును కూలదోయడానికి కారణమైన కుట్ర కుతంత్రాలను పక్కదారి పట్టించేలా బాలకృష్ణ ఈ వేదికను ఉపయోగించుకుంటోన్నారని అన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే పార్టీల నాయకులను పిలిపించుకుని ఎన్టీ రామారవుకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటును వక్రీకరించే ప్రయత్నం చేస్తోన్నారని ధ్వజమెత్తారు.

బావతో తిరిగిన వాడు..
పవన్ కల్యాణ్ ఇప్పటికే చంద్రబాబుతో కలిసే తిరుగుతున్నారని పేర్ని నాని అన్నారు. బావ చంద్రబాబుతో కలిసి తిరిగినవాడికి బావమరిది బాలకృష్ణతో కలిసి తిరగడంలో తప్పేముందని ఆయన వ్యాఖ్యానించారు. తన తండ్రి చావుకు కారకుడైన చంద్రబాబుతో బాలకృష్ణ రోజూ చెట్టాపట్టాలేసుకుని ఆడుకుంటున్నాడని చురకలు అంటించారు. అన్స్టాపబుల్ షో కూడా ఓ షూటింగేనని.. ఇద్దరికీ బాగానే డబ్బులు ముడుతాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications