చంద్రబాబు మార్క్ రాజకీయం - బాలయ్య కు బాధ్యతలు: టార్గెట్ జగన్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు. అందుకు సరైన వేదిక ఎంచుకున్నారు. తనపైన ఉన్న విమర్శలకు బాలయ్య సమక్షంలోనే..ఆయన మద్దతుతోనే సమాధానం చెబుతూ తన మార్క్ రాజకీయం ఏంటో స్పష్టం చేసారు. ఏపీలో నెలకొన్న రాజకీయాల్లో చంద్రబాబు - బాలయ్య తాజా షో హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ వ్యూహాలకు కౌంటర్ సిద్దం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ 175 సీట్లలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు పైన ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు. వీటికి చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ సిద్దం చేసారు.
రాజకీయంగా సమాధానాలతో
టీడీపీ మూలాల నుంచి మొదలు చంద్రబాబు పోటీ చేసే నియోజకవర్గాల వరకు దెబ్బ తీసే ప్రయత్నం సీఎం జగన్ మొదలు పెట్టారు. ఇప్పుడు సీఎం జగన్ లక్ష్యంగా చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఇందుకోసం నందమూరి బాలకృష్ణ టాక్ షో తో ఇక అన్ స్టాపబుల్ అంటూ ప్రారంభించారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షో 'అన్స్టాపబుల్' లో టీడీపీ అధినేత చంద్రబాబు తో తొలి ఎపిసోడ్ సిద్దమైంది. ఇందులో బావను ప్రశ్నిస్తూనే..బాలయ్య నేడు రాజకీయంగా ఎటువంటి సమాధానాలు రావాల్సి ఉందో అవే చెప్పించారు. చంద్రబాబు సరిగ్గా అదే చేసారు. మంచి ఆదరణ ఉన్న షో కావటంతో పాటుగా.. చంద్రబాబు ఒక టాక్ షోకు రావటం అందునా బాలయ్య ప్రశ్నిస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రాజకీయంగా పలు కీలక అంశాలకు సమాధానం చెప్పారు. సీఎం జగన్ తాను ఎన్టీఆర్ ను గౌవరిస్తానని చెబుతూ..నాటి 1995 ఎపిసోడ్ ను ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చారు.
వైఎస్సార్ తో బంధంతో వైసీపీకి కౌంటర్
వైసీపీ మంత్రులు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ..ఎన్టీఆర్ పేరును వైసీపీ నేతలు ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈ షో నుంచి చంద్రబాబు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. తన జీవితంలో మర్చిపోలేని ఘటన అంటే 1995 లో చోటు చేసుకున్న రాజకీయ అంశంగా పేర్కొన్నారు. నాడు మీరూ ఉన్నారంటూ.. ఎన్టీఆర్ తనయుడిగా బాలయ్య మద్దతును మరోసారి చంద్రబాబు గుర్తు చేసి..నందమూరి అభిమానుల యాక్సెప్టెన్సీ పొందేందుకు ప్రయత్నించారు. . 'ఆ విషయంలో కాళ్లు పట్టుకునే వరకు వెళ్లా' అంటూ ఆ ఎపిసోడ్ లో ఏం జరిగిందో..తాను ఎంత చెప్పినా వినకపోవటంతోనే అలా జరిగిందని చెప్పుకొనేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్ పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయానికి కౌంటర్ గా వైఎస్సార్ పేరును చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు. వైఎస్సార్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతూ.. వైసీపీ ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ చంద్రబాబును విమర్శిస్తుంటే... దీనికి కౌంటర్ గా చంద్రబాబు తనకు వైఎస్సార్ కు స్నేహాన్ని ప్రస్తావిస్తూ..జగన్ ను ఇరుకున పెట్టేందుకు ఈ షో ను వేదికగా మలచుకున్నారు.
1995 ఎపిసోడ్ కు సమాధానం
అదే సమయంతో లోకేష్ పైన తరచూ వస్తున్న విమర్శలకు బాలయ్య ఈ షో ద్వారా సమాధానం చెప్పించారు. లోకేశ్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫొటోలను ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. దీనికి చంద్రబాబు సమక్షంలోనే బాలయ్య క్లారిటీ ఇప్పించారు. వాటిని చూసి..చంద్రబాబును స్పందించాని బాలయ్య కోరగా, మామకు లేని అభ్యంతరం తనకు దేనికంటూ చంద్రబాబు లౌక్యంగా తప్పించుకున్నారు. ఇక, మంగళగిరి లో ఓటమి గురించి లోకేష్ ను ప్రశ్నించి.. సమాధానం చెప్పుకొనే అవకాశం ఇచ్చారు. తాను సంకల్పంతో ప్రయత్నించానంటూ లోకేష్ సెంటిమెంట్ పండించారు. ఈ సీరియస్ అంశాలకు ప్రాధాన్యత పెరిగేలా.. షో లో భాగంగా చంద్రబాబు రొమాంటిక్ అంశాలు.. భార్య భువనేశ్వరికి ఫోన్ చేయటం వంటివి బాలయ్య ఈ ఎపిసోడ్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లారు.
బాలయ్య ద్వారా..బాలయ్య చేత
ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు స్వయంగా రొమాన్స్ గురించి మాట్లాడటం.. 'మీ జీవితంలో చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి' అని బాలయ్య ప్రశ్నించగా.. 'నీకంటే ఎక్కువే చేశా. మీరు సినిమాల్లో చేస్తే.. నేను స్టూడెంట్గా చేశా' అని బదులిచ్చారు చంద్రబాబు. దీంతో..ఈ షో లో బావ కళ్లల్లో ఆనందం కోసం బాలయ్య తన రోల్ పోషించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాల-చంద్రులు ఏకమైతే సంచలనాలే అంటూ 2024 ఎన్నికల లక్ష్యం ఏంటో..చంద్రబాబు స్పష్టం చేసారు. ఇప్పుడు ఇక ఈ కాంబినేషన్ తో 2024 ఎన్నికల నాటికి టీడీపీ అన్ స్టాపబుల్ అంటూ టీడీపీ అభిమానులు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు.