చిరంజీవి, శీలంలకు షాక్: యుటిగా హైదరాబాద్కు నో
హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల రాజధానిగా ఉండే పదేళ్ల పాటైనా హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటిగా) చేయాలనే కేంద్ర మంత్రులు చిరంజీవి, జెడి శీలం, ఇతర సీమాంధ్ర నాయకుల ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోలేదని తెలుస్తోంది. బిజెపి ప్రతిపాదించిన సవరణలను మాత్రమే తెలంగాణ బిల్లులో చేర్చించినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి జీవోఎం సభ్యుడు జైరాం రమేష్, శుక్రవారంనాడు కాంగ్రెసు నేతలు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడితో సమావేశమై తెలంగాణ బిల్లుకు తుది మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది.
బిజెపి సూచించిన సవరణలకు ప్రాధాన్యం ఇచ్చి, కాంగ్రెసు పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు సూచించిన సవరణలను పక్కన పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ను యుటిగా చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాయల తెలంగాణ ప్రతిపాదనను పూర్తిగానే వెనక్కి నెట్టారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడకుండా భద్రాచలం ప్రాంతంలోని ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో చేర్చాలనే బిజెపి ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. భద్రాచలంలోని ముంపు ప్రాంతాలను తెలంగాణలో చేరిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని హరిబాబు, తదితర బిజెపి సీమాంధ్ర నేతలు వెంకయ్యనాయుడికి చెప్పుకున్నారు. దీంతో ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చాలనే బిజెపి ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే, ముంపు గ్రామాల పేరుతో భద్రాచలం ప్రాంతంలోని కొంత భాగాన్ని సీమాంధ్రలో చేర్చకూడదని ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెసు నేతలు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్జప్తి చేశారు. కాగా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు భారీ ప్యాకేజీ ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. హైదరాబాద్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచాలనే ప్రతిపాదనను కూడా బిల్లులో చేర్చినట్లు తెలుస్తోంది.