బాబుది అహంకారం, సైకాలజిస్ట్కి చూపించాలి: కల్పన, లోకేష్ వల్లే: డొక్కా
హైదరాబాద్/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తిపోశారు. చంద్రబాబును సైకాలజిస్ట్కు చూపించాలని ఆమె ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని అనవసర ప్రచారం చేస్తున్నారన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని ఆ పార్టీ నాయకులు అనుకోవడం పొరపాటే అన్నారు. అనవసర ప్రచారం తగదన్నారు. మురికివాడల ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబును కచ్చితంగా మానసిక వైద్యుడికి చూపించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మురికివాడల ప్రజలు ఓట్లు వేస్తేనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడేమో, వారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అగ్రకుల అహంకారంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, గతంలో దళితులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తికి అది సరికాదన్నారు.

ఎప్పడూ సింగపూర్, దావోస్, మలేషియా, జపాన్ అంటూ విదేశాలు పట్టుకొని తిరేగ చంద్రబాబుకు విదేశీయులే నచ్చుతారని ఎద్దేవా చేశారు. భారతీయులు, మురికివాడల ప్రజలు ఆయనకు నచ్చడం లేదన్నారు. అన్ని వర్గాల వారిని కించపరుస్తున్న చంద్రబాబులో అహంకారం కనిపిస్తోందన్నారు.
40 సర్పంచులు ఎవరో చెప్పండి: వైసిపి నేత రావి
గుంటూరు జిల్లాకు చోందిన 40 మంది వైసిపి సర్పంచులు టిడిపిలో చేరడం బోగస్ అని వైసిపి నేత రావి వెంకట రమణ అన్నారు. జిల్లా టిడిపి నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. టిడిపిలో చేరిన 40 సర్పంచులు ఎవరో, వైరి పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎదుట గొప్పల కోసమే మంత్రి రావెల తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు.
లోకేష్ వల్లే టిడిపిలోకి వచ్చా: డొక్కా
నారా లోకేష్ పైన వైసిపి నేతలు విమర్శలు సరికాదని టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పార్టీలో సంక్షోభాన్ని సరిదిద్దుకోలేక తమ పార్టీ పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. సీఎం చంద్రబాబు సాధారణ జీవితం గడుపుతున్నారన్నారు.
నారా లోకేష్ అందరితో కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. తాను టిడిపిలో చేరేందుకు ముఖ్య కారకుడు లోకేష్ అని చెప్పారు. వైసిపి నేతలతో మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదన్నారు. పార్టీలోకి రావాలని ఎవర్నీ పిలువమని, వచ్చే వారిని కాదనమని చెప్పారు.
కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాం: రఘువీరా
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం ఉదయం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశామని ఆయన అంగీకరించారు. దాని ఫలితాన్ని ప్రస్తుతం తామంతా అనుభవిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మాట నూరు శాతం నిజమని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేశామని అభిప్రాయపడ్డారు. ఆ ఫలితాలను మేము అనుభవిస్తున్న మాట కూడా అంతే వాస్తవమన్నారు. అయితే, అప్పుడు ప్రజల కోసం అలా చేశామన్నారు.












Click it and Unblock the Notifications