23న టిడిపిలో చేరుతున్నా.. రండి: జగన్కు ఉప్పులేటి కల్పన '21వ షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చేందుకే పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నిర్ణయించుకున్నారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చేందుకే పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నిర్ణయించుకున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆమె ఈ రోజు (గురువారం) ప్రకటించారు.
టిడిపిలో చేరుతున్నానని చెప్పడం ద్వారా ఆమె గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. ఆమె అనుచరులు స్పందించకపోయినా టిడిపికి చెందిన పలువురు నాయకుల అండతో ఆమె ఈ నెల 23న విజయవాడలో సైకిల్ ఎక్కనున్నారు.
జగన్కు మరో షాక్: టిడిపిలోకి ఎమ్మెల్యేల కల్పన?, వర్ల ఏమన్నారంటే?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఏడాది కాలంగా ఆమె వైసీపీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం పలువురు వైసీపీ, టీడీపీ నాయకులతో ఆమె మాట్లాడారు.
23వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ చేరుకోవాలని ఆమె తన వారికి సూచించారు. అందుకు కొందరు సుముఖత వ్యక్తం చేశారు. టిడిపి తరపున రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె నిడుమోలు, పామర్రు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులపై ఓటమి చవిచూశారు.
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పామర్రు నుంచి పోటీ చేసి టిడిపి నేత వర్ల రామయ్య పైన గెలుపొందారు. అయితే టిడిపి నేతలతో మాత్రం ఆమె సత్సంబంధాలు కొనసాగించారు. బుధవారం నాడు టిడిపి ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావును కూడా కలిశారు.
పామర్రు నియోజకవర్గంలో విజయం సాధించిన నాటి నుంచి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్న బాధ ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం టిడిపిలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉప్పులేటి కల్పన చేరికతో వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 21కి చేరుకుంటుంది.