ఉత్తరాంధ్ర రాజకీయాల్లో 'ముగ్గురు మొనగాళ్లు'!
విశాఖపట్నం రాజధానిగా కార్యకలాపాలు ప్రారంభమైతే ఉత్తరాంధ్రలో మెజారిటీ తమదే అవుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు వేరు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీదే పైచేయి. గత ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ హవాలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను కేవలం 6 స్థానాలనే టీడీపీ దక్కించుకోగలిగింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు అధికార వైసీపీ, జనసేన.. ఇలా ఈ మూడు పార్టీలు ఉత్తరాంధ్రపైనే దృష్టిసారించాయి.

ఇక్కడి నుంచే పోరాటాన్ని ప్రారంభించిన జనసేనాని
ఏ పార్టీకా పార్టీ ఈ ప్రాంతంలో ప్రబలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాయి. విశాఖపట్నం రాజధానిగా కార్యకలాపాలు ప్రారంభమైతే ఉత్తరాంధ్రలో మెజారిటీ తమదే అవుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై తన పోరాటాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. విశాఖలో జరిగిన పరిణామాలు.. ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశం.. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలాంటివన్నీ వరుసగా జరిగాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కేవలం వైసీపీని ఓడించడం కోసమే తాను పనిచేస్తానని జనసేనాని స్పష్టంగా ప్రకటించారు.

అభిమానులను ఓటర్లుగా మలచాలని..
ప్రభుత్వంపై పోరాటానికి ఉత్తరాంధ్రను వేదికగా చేసుకున్నారు. సినిమాల పరంగా తనకున్న అభిమానుల బలం ఉత్తరాంధ్రలో ప్రబలంగా ఉండటంతో వారినందరినీ వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటర్లుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి ఈ మూడు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటివి. వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ ప్రతాపాన్ని చూపించి సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను సాధించేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీకన్నా టీడీపీ-జనసేనదే పై చేయిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉగాది నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తే..
విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత రాబోయే ఉగాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల ఈ మూడు జిల్లాల్లోని ప్రజల్లో భావోద్వేగాలు కలగడంద్వారా వారంతా వైసీపీవైపే చూస్తారనేది ఆ పార్టీ పెద్దల అంచనాగా ఉంది. ముందు కార్యకలాపాలను ప్రారంభిస్తే మిగతావన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతాయని, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటవుతుంది కాబట్టి ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో కూడా ఒక నమ్మకం కలుగుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications