అమరావతి 2.0: ఇప్పటికైనా మార్పు రావాలి
అమరావతిని విస్తరించడం, దీనికోసం 40,000 ఎకరాల మేర భూమిని సేకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. చేస్తోన్న ప్రయత్నాలు విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సొంత పార్టీలోనే అభ్యంతరం వ్యక్తమౌతోంది.
తెరపైకి వచ్చిన మాజీ మంత్రి వడ్డే..
అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తయిన తరువాత మలి విడతకు వెళితే బాగుంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ డైహార్డ్ అభిమానులు. అదే సమయంలో టీడీపీకే చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెరమీదికి వచ్చారు. అమరావతి విస్తరణ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాజధాని కోసం రైతుల నుంచి..
రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలు తీసుకున్నారని, అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉందని వడ్డే శోభనాద్రీశ్వరరావు గుర్తు చేశారు. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2,700 ఎకరాలు మాత్రమేనని అన్నారు.
అదనంగా మరో 44,000 ఎకరాలా..
తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారని, ఇప్పుడు అదనంగా మరో 44,000 ఎకరాలు తీసుకుంటామని ప్రకటించడం సహేతుకం కాదని అన్నారు. రాజధాని కోసం 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఇంకా 69,000 కోట్ల రూపాయలు అవసరమౌతాయని ప్రభుత్వమే స్వయంగా చెబుతోందని పేర్కొన్నారు.
నాడు రెండు కళ్ల సిద్ధాంతంతో..
ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాజదానిని నిర్మించాలనుకోవడం అనాలోచిత చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. రెండు కళ్ల సిద్ధాంతంతో గతంలో చంద్రబాబు పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారని ధ్వజమెత్తారు.
ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా..పోరాటం ఏదీ?
మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టిందని, ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయట్లేదని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు అంటూ ప్రశ్నించారు వడ్డే. హైపర్ లూప్ రైలు వ్యవస్థ అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదని గుర్తు చేశారు.
చంద్రబాబు అనాలోచిత, తొందరపాటు చర్య..
ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత, తొందరపాటు చర్య అని విమర్శించారు. ధనవంతులు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదని అన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం..
చంద్రబాబు నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతోందని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 58,000 ఎకరాలు ఉంటే మళ్లీ 44,000 ఎకరాలు తీసుకోవడం దేనికని ఆయన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారా అని నిలదీశారు.
40 అంతస్తుల బిల్డింగుల వల్ల..
రైతుల తరపున ప్రభుత్వం పొలాన్ని ప్రభుత్వం అమ్మడమేంటని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉన్నది రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికి కాదని చెప్పారు. 40 అంతస్తుల బిల్డింగుల వల్ల ప్రజలకు ఒరిగేదేంటని ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు మంచి పరిపాలన అని హితవు పలికారు.
మెట్రో రైలు జపం చేయడమెందుకు?..
ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?, ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా?, మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?, అమరావతిలో 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు?, ఎవడికి కావాలి?, శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారని ఆయన ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
పంటలకు సాగునీరు..
శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు..పంటలకు సాగునీరు అని గుర్తు చేశారు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోవడం కనిపించట్లేదా అని నిలదీశారు.
ఇప్పటికైనా మార్పు రావాలి
చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని తాను కోరుతున్నానని వడ్డే చెప్పారు. పీ4 గురించి తరువాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడాలని, కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు. మెట్రోరైళ్లపై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదని అన్నారు.
10 శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించగలరా?..
డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు టీడీపీ నాయకులవేనని, నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో 10 శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించగలరా? పేదల కోసం హెరిటేజ్ నుంచి చంద్రబాబు ఏమీ ఇవ్వరా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications