అందరి దృష్టీ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి మీదే..!!
TTD Chairman BR Naidu: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 65,656 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,360 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.15 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
16 గంటలు..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 28 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమల ముస్తాబు..
కాగా- వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన టికెట్ల జారీ తేదీలను కూడా టీటీడీ ఇదివరకే విడుదల చేసింది.
టీటీడీ పాలకమండలి నేడు సమావేశం
ఈ పరిస్థితుల మధ్య టీటీడీ పాలకమండలి నేడు సమావేశం కాబోతోంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు దీనికి అధ్యక్షత వహించనున్నారు. బీఆర్ నాయుడు సారథ్యంలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తరువాత జరగబోయే రెండో భేటీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాలక మండలి సభ్యులు..
పాలక మండలి సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, జేఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఎక్స్- అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తోన్న రెవెన్యూ (దేవాదాయం) మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి హాజరు కానున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది వరకు భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఈ పాలక మండలిలో చర్చించనున్నారు.
రద్దీ క్రమబద్దీకరణపై..
రద్దీని క్రమబద్దీకరించడంతో పాటు టోకెన్లు, టికెట్లు ఉన్న ప్రతి ఒక్క భక్తుడికీ స్వామివారి దర్శనాన్ని కల్పించడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తారు. క్యూ లైన్లల్లో వేచివుండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేయడానికి ఎంతమంది శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచాలనే విషయంపై చర్చస్తారు.
ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్..
ఉద్యోగులందరికీ నేమ్ బ్యాడ్జీలను అందించాలనే ప్రతిపాదనలు కూడా భేటీ ముందుకు రానున్నాయి. ఇప్పటివరకు నేమ్ బ్యాడ్జీల వ్యవస్థ టీటీడీలోలేదు. కొత్తగా దీన్ని ప్రవేశపెట్టనుంది టీటీడీ. ఒక్క తిరుమలలో మాత్రమే కాకుండా టీటీడీ పాలక మండలి పరిధిలోకి వచ్చే విభాగాలన్నింట్లో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికీ ఈ బ్యాడ్జీలు అందుతాయి.
దురుసు ప్రవర్తనకు..
శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే అశేష భక్తుల పట్ల కొందరు ఉద్యోగులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని గుర్తించడానికి, వారి పేర్లు భక్తులకు తెలిసేలా చేయడానికి నేమ్ బ్యాడ్జీలను అందిస్తామంటూ బీఆర్ నాయుడు ఇదివరకే సూచనప్రాయంగా తెలియజేశారు.












Click it and Unblock the Notifications