ఏం జరిగిందంటే: సొంత పార్టీ నేత-కొడుకుతో గొడవపై వంశీ, వైసిపీపై ఫైర్
టిడిపి మహిళా ఎంపీటీసీని గన్నవరం ఎమ్మెల్యే వంశీ అవమానించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. దీనిపై ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు.
విజయవాడ: టిడిపి మహిళా ఎంపీటీసీని గన్నవరం ఎమ్మెల్యే వంశీ అవమానించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. దీనిపై ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు.
సోషల్ మీడియాలో ఈ వదంతుల విషయాన్ని చాలామంది చెప్పారని, కానీ తాను పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత తాను ఆ వీడియో చూశానని చెప్పారు. అరుణ కుమారి గారు అని తమ పార్టీ ఎంపీటీసీ అని, తానే టిక్కెట్టు ఇచ్చానని, ఎంపీటీసీగా గెలిపించుకున్నానని, మూడేళ్లుగా పరిచయం ఉందని, అరుణక్క అని పిలుస్తానని, తాను గౌరవంగా చూస్తానని, ఆమె కూడా తనతో అదే విధంగా ఉంటారని చెప్పారు. తాను లేకపోయినా తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లేంత చనువు అరుణక్కకు ఉందన్నారు.
ఓ గుడి ప్రారంభోత్సవం గురించి తనను పిలుద్దామని ఆమె తన కార్యాలయానికి వచ్చారని, తాను బయటకు వెళడంతో వేరే వాళ్ల సీట్లో ఆమె కూర్చుందని, దీంతో ఈ సటు మీదీ కాదని, పీఆర్ కూర్చునే సీటు అని, కొంచెం బయటకు వెళ్లి కూర్చోండి అని ఆమెతో ఎవరో చెప్పినట్లు తెలిసిందన్నారు.
దీంతో ఆమె మనస్తాపానికి గురయ్యారని, ఈ విషయాన్ని తనకు కూడా చెప్పిందని, ఆ మాట ఎవరన్నారో వారిని మందలిస్తానని చెప్పి, ఆఫీసులోని వారిని పిలిస్తే ఆమె గుర్తించలేకపోయిందన్నారు.
ఈ సమయంలో ఆమె తనయుడు కొంచెం స్పీడ్ అయ్యాడని తెలిపారు. దీంతో తాను ఇంత చిన్న వయస్సులో కోపమేమిటని అడిగానని, అరుణను అక్క అంటాను కాబట్టి.. తాను కూడా తన అక్క కొడుకును మందలించినట్లుగా మందలించానని చెప్పారు. కానీ వైసిపి మాత్రం తాను తీవ్రంగా మందలించినట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింప చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.