ఏపీలో రైతులకు, ప్రజలకు బంపర్ న్యూస్ చెప్పిన చంద్రబాబు!
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అరితుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం మరియు సంబంధిత రంగాల అభివృద్ధిపై ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించి 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్యాలను సాధించడంలో భాగంగా ప్రాథమిక రంగంలోని ఆరు మిషన్లపై విస్తృత చర్చ చేశారు. వ్యవసాయం, తోటల పంటలు, చేపల పెంపకం, మార్కెటింగ్, పశు సంవర్ధకం వంటి శాఖల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి అనేక కీలక సూచనలు చేశారు.
'ఫార్మ్ టు హోమ్' వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
ఇందులో భాగంగా రైతుల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చే 'ఫార్మ్ టు హోమ్' వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న రైతు బజార్లను ఆధునికీకరించి, డిజిటల్ యాప్ ద్వారా మరింత సౌకర్యవంతం చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహించాలన్నారు.

అరటి పంట కోసం కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు
రాయలసీమలో అరటి పంట కోసం కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రసాయన ఎరువులపై ఆధారపడకుండా సూక్ష్మ పోషకాలు మరియు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులను కోరారు. భూసార పరీక్షల ద్వారా ప్రతి రైతుకు సరైన పంట సలహాలు అందించాలని, పంటలకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా అందేలా చూడాలని సూచించారు.
చేపల పెంపకం రైతులు, మత్స్యకారులకు నిధులు
చేపల పెంపకం రైతులకు విద్యుత్ రాయితీ కింద రూ.1,100 కోట్లు కేటాయించారు. కొత్తగా 12,680 విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసి అదనంగా రూ.188 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాల ఆక్వా సాగు ప్రాంతాలను జోన్ వ్యవస్థలోకి తీసుకురావాలని నిర్ణయించారు. మత్స్యకారులకు రూ.240 కోట్లతో 200 మరపడవలు అందించాలని ఆదేశించారు.
రైతుల ఆదాయం పెంచే ప్లాన్స్ చేస్తున్న చంద్రబాబు
అంతేకాకుండా, మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు, యాదవోలు వద్ద కోకోసిటీ, పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రైతు సాధికార సంస్థ ద్వారా యంత్రాలు, డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని ఆధునికీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయం పెరిగి, ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications